ఆధునిక సాంకేతిక యుగంలో ప్రపంచం ఎంత వేగంగా ముందుకు దూసుకెళ్తున్నా, కొన్ని ప్రాంతాల్లో ఇంకా మూఢనమ్మకాల మాయాజాలం కొనసాగుతూనే ఉంది. ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కొందరు కేటుగాళ్లు క్షుద్ర పూజలు, చేతబడులు పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు. అనారోగ్యం, ఆర్థిక సమస్యలు, కుటుంబ ఇబ్బందులను కారణంగా చూపిస్తూ భయపెట్టి విలువైన ఆభరణాలు దోచుకుంటున్న ఘటనలు తరచూ వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా సూర్యాపేట జిల్లాలో ఇలాంటి ఘటనే కలకలం రేపింది. క్షుద్ర పూజల పేరుతో ఓ మహిళ ఇంటి బంగారాన్ని మోసం చేసి దోచుకున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.
మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లికి చెందిన పేర్ల చిరంజీవి అనే వ్యక్తి వృత్తిరీత్యా నాటు మందులు అమ్ముతూ జీవనం సాగిస్తున్నాడు. అయితే సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో ప్రజల భయాలను ఆసరాగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో సూర్యాపేట జిల్లా కుడకుడ ప్రాంతానికి చెందిన లింగంపల్లి మమత కుటుంబంతో అతడు పరిచయం పెంచుకున్నాడు. మమత కుటుంబ సభ్యులు కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతుండగా, గతంలో కుటుంబంలో మరణాలు కూడా చోటుచేసుకున్నాయి. ఈ పరిస్థితిని ఉపయోగించుకున్న చిరంజీవి వారి ఇంటిపై క్షుద్ర శక్తుల ప్రభావం ఉందని, చేతబడి జరిగిందని నమ్మించాడు. తనకు క్షుద్ర పూజలు తెలుసని, ప్రత్యేక పూజలు చేస్తే సమస్యలు తొలగిపోతాయని చెప్పి వారిని విశ్వసింపజేశాడు.
మే 8న మమత ఇంటికి వెళ్లిన చిరంజీవి, ఇంట్లో ఉన్న బంగారంపై దిష్టి ఉందని, పూజలు చేస్తేనే సమస్యలు తొలగిపోతాయని చెప్పాడు. ఈ క్రమంలో మమత మెడలో ఉన్న పుస్తెల తాడు, చంద్రహారం, బంగారు గొలుసు, బిళ్లలను తీసుకుని వాటిపై ప్రత్యేక పూజలు చేస్తున్నట్లు నటించాడు. అనంతరం వాటిని మట్టి గురిగిలో వేయించి పూజలు చేస్తున్నట్లు చూపించాడు. అయితే అసలు బంగారం ఉన్న గురిగిని తన సంచిలో దాచిపెట్టి, దాని స్థానంలో మరో ఖాళీ గురిగిని పెట్టి ఇంటి ఆవరణలో పాతిపెట్టినట్లు పోలీసులు వెల్లడించారు. 21 రోజుల వరకు ఆ గుంతను తవ్వకూడదని, అప్పటివరకు ప్రతిరోజూ పూజలు చేయాలని సూచించి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
మొదట్లో ఫోన్లో అందుబాటులో ఉన్న చిరంజీవి, కొన్ని రోజుల తర్వాత మమతకు స్పందించడం మానేశాడు. దీంతో అనుమానం వచ్చిన మమత ఇంట్లో పాతిపెట్టిన గురిగిని తవ్వి చూడగా అందులో ఏమీ లేకపోవడంతో మోసపోయినట్లు గ్రహించింది. వెంటనే ఆమె సూర్యాపేట రూరల్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టగా, దోచుకున్న బంగారాన్ని తాకట్టు పెట్టేందుకు చిరంజీవి సూర్యాపేటకు వస్తున్నట్లు సమాచారం అందింది. అయిలాపురం స్టేజ్ వద్ద పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా నిందితుడు పారిపోయేందుకు ప్రయత్నించాడు. అయితే పోలీసులు వెంటాడి అతడిని అదుపులోకి తీసుకున్నారు.
నిందితుడి వద్ద నుంచి సుమారు ఐదున్నర తులాల బంగారంతో పాటు బైక్, సెల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నట్లు సూర్యాపేట రూరల్ సీఐ రాజశేఖర్ తెలిపారు. ప్రజలు మూఢనమ్మకాల పేరుతో చేసే క్షుద్ర పూజలను నమ్మి మోసపోవద్దని, అనుమానాస్పద వ్యక్తులపై వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ALSO READ: రోబో ఇక వాకీ-టాకీ కాదు.. మన సహోద్యోగి!