హైదరాబాద్,క్రైమ్మిర్రర్: తెలుగు సినీ పరిశ్రమలో హాస్యనటుడిగా చెరగని ముద్ర వేసిన వెంకట సుబ్రహ్మణ్యం అంటే ప్రేక్షకులకు ఇప్పటికీ ప్రత్యేకమైన అభిమానమే. కేవలం కమెడియన్ మాత్రమే కాదు.. జర్నలిస్టుగా, రచయితగా, దర్శకుడిగా కూడా ఆయన తన ప్రతిభను నిరూపించుకున్నారు.
1957లో కృష్ణా జిల్లా తెనాలిలో జన్మించిన ఏవీఎస్.. చిన్నప్పటి నుంచే మిమిక్రీ, నటనపై ఆసక్తి పెంచుకున్నారు. కాలేజీ రోజుల నుంచే ఉపాధ్యాయులు, కళాకారులను అనుకరిస్తూ అందరి ప్రశంసలు అందుకున్నారు. తర్వాత జర్నలిజం వైపు అడుగుపెట్టి ‘ఉదయం’ పత్రికలో స్టాఫ్ రిపోర్టర్గా పనిచేశారు.
తాజాగా సీనియర్ దర్శకుడు హరిశ్చంద్ర రావు ఏవీఎస్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం.. ఏవీఎస్ జర్నలిస్టుగా ఉన్న సమయంలో పాము చర్మాల స్మగ్లింగ్, అమ్మాయిల అక్రమ రవాణా వంటి తీవ్రమైన అంశాలపై సంచలన కథనాలు రాశారట. నిజాలు వెలికితీయడానికి ప్రత్యక్షంగా వెళ్లి పరిశోధనలు చేసేవారని చెప్పారు.
ఈ క్రమంలోనే కొంతమంది స్మగ్లర్లు ఏవీఎస్ను చంపాలని కూడా ప్రయత్నించారట. అయితే పోలీసుల రక్షణతో ఆయన ఆ ప్రమాదం నుంచి తప్పించుకున్నారని తెలిపారు. నిజం కోసం ఎంతటి రిస్క్ అయినా తీసుకునే ధైర్యం ఏవీఎస్కు ఉండేదని ఆయన గుర్తుచేశారు.
జర్నలిస్టుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న తర్వాతే ఏవీఎస్ సినీ రంగంలోకి వచ్చారు. దర్శకుడు Bapu తెరకెక్కించిన Mister Pellam సినిమాతో నటుడిగా పరిచయమై తొలి సినిమాకే నంది అవార్డు అందుకున్నారు.
ఆ తర్వాత వందలాది సినిమాల్లో నటించి తనదైన కామెడీ టైమింగ్తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. హాస్య నటుడిగా మాత్రమే కాకుండా రచయితగా, నిర్మాతగా, దర్శకుడిగా కూడా తెలుగు సినిమాకు విశేష సేవలు అందించారు.