క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ రంగంలోనూ వర్క్ ఫ్రమ్ హోమ్ (WFH) విధానాన్ని ప్రవేశపెట్టేలా తీసుకున్న నిర్ణయం తదుపరి పరిణామాలపై స్పష్టమైన సంకేతాలు ఇస్తోంది. అమరావతిలోని నిడమర్రులో జరిగిన బొల్లినేని ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్కిల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (BISER) శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.
పశ్చిమాసియా (మిడిల్ ఈస్ట్) యుద్ధ వాతావరణం వల్ల అంతర్జాతీయంగా చమురు, గ్యాస్ సంక్షోభం తలెత్తింది. దీనివల్ల దేశంపై పడే ఆర్థిక భారాన్ని, ఇంధన వినియోగాన్ని తగ్గించడానికి ఈ నిర్ణయం దోహదపడుతుంది అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించిన ఎనిమిది సూత్రాల పొదుపు అజెండాకు మద్దతుగా రాష్ట్ర ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది.
ఉద్యోగులు ఇంటి నుంచే పని చేయడం ద్వారా పెట్రోల్, డీజిల్ వినియోగం తగ్గి, దేశం నుంచి తరలిపోయే విదేశీ మారకద్రవ్యం (Foreign Exchange) ఆదా అవుతుందని సీఎం విశ్లేషించారు. ఉద్యోగులు పూర్తిగా కాకుండా, ఒక రోజు ఇంటి నుంచి, మరో రోజు కార్యాలయానికి వచ్చి పని చేసేలా హైబ్రిడ్ మోడల్ తీసుకురావాలని ఏపీ ప్రభుత్వం యోచిస్తోంది.
ప్రభుత్వ కార్యాలయాల్లో టెలీ కాన్ఫరెన్స్లు, వీడియో కాన్ఫరెన్స్లకు ప్రాధాన్యత పెంచడం ద్వారా అధికారులు రోడ్డుపైకి రావలసిన అవసరాన్ని తగ్గిస్తారు. ఈ విధానానికి సంబంధించిన మార్గదర్శకాల పై నేడో, రేడో రాష్ట్ర ప్రభుత్వం నుండి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అధికారికంగా విడుదల కానుంది అని సమాచారం.