US Airstrikes In Iran: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు ఇంకా కొనసాగుతున్నాయి. కాల్పుల విరమణ అమల్లో ఉన్నప్పటికీ, అమెరికా మరోసారి ఇరాన్కు చెందిన లక్ష్యాలపై దాడులు నిర్వహించింది. ఈ విషయాన్ని అమెరికా సెంట్రల్ కమాండ్ అధికారికంగా ప్రకటించింది. హర్మూజ్ జలసంధి మీదుగా ప్రయాణిస్తున్న వాణిజ్య నౌకలపై దాడులు చేస్తున్న ఇరాన్కు అనుకూల బలగాలను లక్ష్యంగా చేసుకుని ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు అమెరికా వెల్లడించింది.
సముద్ర మార్గ భద్రతను కాపాడేందుకే దాడులు
ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన హర్మూజ్ జలసంధి ప్రాంతంలో ఇటీవల ఉద్రిక్తతలు పెరిగాయి. అక్కడుగా వెళ్తున్న కొన్ని నౌకలపై దాడులు జరిగినట్లు అమెరికా ఆరోపిస్తోంది. ఈ దాడులకు ఇరాన్ మద్దతు ఉన్న బలగాలే కారణమని యూఎస్ అధికారులు చెబుతున్నారు. సముద్ర మార్గ భద్రతను కాపాడేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని అమెరికా స్పష్టం చేసింది.
అమెరికా దాడులపై ఇరాన్ ఆగ్రహం
అమెరికా వైమానిక దాడులపై ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ దేశంలోని నివాస ప్రాంతాలపైనా బాంబుల దాడులు జరిగాయని ఇరాన్ ప్రతినిధులు ఆరోపించారు. ఈ దాడుల్లో సాధారణ ప్రజలు కూడా ప్రభావితమయ్యే అవకాశం ఉందన్నారు. అమెరికా చర్యలు ప్రాంతీయ శాంతి భద్రతలకు ప్రమాదకరమని ఇరాన్ విమర్శించింది.
మరోవైపు అమెరికా మాత్రం తమ దాడులు పూర్తిగా వ్యూహాత్మక లక్ష్యాలపైనే జరిగాయని చెబుతోంది. సాధారణ ప్రజలకు హాని కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నామని యూఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది. ఇరాన్ మద్దతు ఉన్న మిలిటెంట్ గ్రూపులు సముద్ర మార్గాల్లో దాడులకు పాల్పడితే తగిన ప్రతిస్పందన కొనసాగుతుందని హెచ్చరించింది. ఇప్పటికే మధ్యప్రాచ్యంలో జరుగుతున్న ఘర్షణల కారణంగా అంతర్జాతీయ సమాజం ఆందోళన చెందుతోంది. కాల్పుల విరమణ కొనసాగుతున్న సమయంలో మళ్లీ అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరగడం ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురి చేస్తోంది. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారకుండా ఇరు దేశాలు సంయమనం పాటించాలని పలుదేశాలు కోరుతున్నాయి.