పశ్చిమబెంగాల్, అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంతో, ఈ రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వం ఏర్పాటు ప్రక్రియ వేగం పుంజుకుంది. కేంద్ర నాయకత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టి అవసరమైన చర్యలు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాలకు కేంద్ర పరిశీలకులను నియమించింది.
బెంగాల్ సీఎంను ఎంపిక చేయనున్న అమిత్ షా
బెంగాల్లో పార్టీ శాసనసభాపక్ష నేతను ఎంపిక చేసే ప్రక్రియను పర్యవేక్షించేందుకు కేంద్రం నుంచి ప్రత్యేక ప్రతినిధులను పంపింది. ఈ బాధ్యతలను పర్యవేక్షించే కేంద్ర పరిశీలకులుగా అమిత్ షాను నియమించారు. ఆయనకు సహాయంగా ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి కో-అబ్జర్వర్గా వ్యవహరించనున్నారు. వీరి పర్యవేక్షణలో శాసనసభాపక్ష నేత ఎంపిక పూర్తవుతుందని, దాంతో ముఖ్యమంత్రి ఎంపిక కూడా సులభంగా పూర్తయ్యే అవకాశముంది. సమాచారం ప్రకారం, మే 9న బెంగాల్లో కొత్త ప్రభుత్వం ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉంది.
అస్సోం పరిశీలకుడిగా జేపీ నడ్డా
అస్సాంలో కూడా ఇదే తరహాలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. అక్కడ కేంద్ర పరిశీలకుడిగా J. P. నడ్డాను నియమించారు. ఆయనకు సహాయకుడిగా హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ వ్యవహరించనున్నారు. వీరు కలిసి అస్సాంలో బీజేపీ శాసనసభాపక్ష నేత ఎంపిక ప్రక్రియను నిర్వహించనున్నారు.
రెండు రాష్ట్రాల్లో బీజేపీ భారీ విజయం
ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి రెండు రాష్ట్రాల్లోనూ బలమైన ఆధిక్యం లభించింది. పశ్చిమబెంగాల్లో పార్టీ భారీ మెజారిటీ సాధించగా, అస్సాంలో కూడా మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసే స్థాయిలో సీట్లు గెలుచుకుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పాటు ప్రక్రియ వేగంగా పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేంద్ర నాయకత్వం ప్రత్యక్షంగా వ్యవహరిస్తూ రాష్ట్రాల్లో పార్టీ ప్రభుత్వాల ఏర్పాటు కోసం సమన్వయం చేస్తోంది. త్వరలోనే రెండు రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు బాధ్యతలు చేపట్టే పరిస్థితి కనిపిస్తోంది.