పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల మధ్య అంతర్జాతీయ ముడి చమురు ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నప్పటికీ, తాజాగా గణనీయంగా తగ్గడం ప్రపంచ మార్కెట్లకు ఊరటనిచ్చింది. ఈ పరిణామానికి ప్రధాన కారణంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన కీలక ప్రకటన నిలిచింది. ఇరాన్లోని విద్యుత్ కేంద్రాలు, ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులను 5 రోజుల పాటు వాయిదా వేయాలని అమెరికా రక్షణ శాఖకు ఆదేశాలు ఇచ్చినట్టు ఆయన వెల్లడించారు. ఈ ప్రకటన వెలువడిన వెంటనే అంతర్జాతీయంగా చమురు మార్కెట్లో ప్రతిస్పందన కనిపించింది. ముఖ్యంగా బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ ధర దాదాపు 14 శాతం పడిపడి 97 డాలర్ల వద్దకు చేరుకోగా, యూఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్ ధర సుమారు 12 శాతం తగ్గి 86 డాలర్లకు చేరింది. మొత్తంగా చూస్తే గ్లోబల్ స్థాయిలో ముడి చమురు ధరలు సగటున 13 శాతం మేర క్షీణించాయి.
ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.. పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులను పూర్తిగా ఆపివేయడానికి రెండు రోజులుగా చర్చలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఇరాన్తో జరుగుతున్న ఈ చర్చలు సానుకూల ఫలితాలను ఇవ్వాలని ఆశిస్తూ, తాత్కాలికంగా దాడులను నిలిపివేసినట్టు వివరించారు. ఇరాన్లోని విద్యుత్ ప్లాంట్లు, ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులను 5 రోజుల పాటు వాయిదా వేయడం ద్వారా చర్చలకు అనుకూల వాతావరణం కల్పించాలన్నదే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. భవిష్యత్ చర్యలు ఈ చర్చల ఫలితాలపై ఆధారపడి ఉంటాయని కూడా పేర్కొన్నారు.
ఇక చమురు సరఫరా విషయంలో కూడా ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా సరఫరా లోటు తలెత్తకుండా వ్యవస్థలో తగినంత చమురు నిల్వ ఉండాలని తాను కోరుకుంటున్నట్టు తెలిపారు. సరుకులతో నిండిన నౌకలు వెనక్కి తగ్గకుండా సరఫరాను కొనసాగించాలని సూచించారు. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలకు పూర్తిస్థాయిలో పరిష్కారం కనుగొనే దిశగా ఈ వారమంతా ఇరాన్తో నిర్మాణాత్మక చర్చలు కొనసాగనున్నాయని చెప్పారు.
గత నెల 28న ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడులు ప్రారంభించిన తర్వాత పరిస్థితులు వేగంగా మారాయి. ఆ సమయంలో బ్యారెల్ ముడి చమురు ధర 70 డాలర్లుగా ఉండగా, కొన్ని రోజుల వ్యవధిలోనే 125 డాలర్ల వరకు పెరిగింది. గత 3 వారాల పరిస్థితులను పరిశీలిస్తే ధరలు సుమారు 56 శాతం పెరిగినట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఈ సమయంలో ఖతార్పై ఇరాన్ దాడులు జరగడంతో సహజ వాయువు మార్కెట్లో తీవ్ర కొరత ఏర్పడింది. ముఖ్యంగా ఎల్ఎన్జీ సరఫరా లోపంతో అనేక దేశాల్లో ఇంధన సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయి.
ఈ ప్రభావం మనదేశంలో కూడా స్పష్టంగా కనిపించింది. కమర్షియల్ ఎల్పీజీ సరఫరా అంతరాయం కారణంగా హాస్టళ్లు, రెస్టారెంట్లు, చిన్న హోటళ్ల యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వ్యాపార కార్యకలాపాలు మందగించడంతో భారీ నష్టాలు చవిచూశారు. ఇతర రంగాలపై కూడా ఈ ప్రభావం క్రమంగా పడుతోంది. ఇలాంటి సమయంలో ట్రంప్ ప్రకటించిన తాత్కాలిక యుద్ధ విరమణ నిర్ణయం మార్కెట్లకు ఊరటనిచ్చింది. అందుకే ఒక్కరోజులోనే ముడి చమురు ధరలు సగటున 13 శాతం తగ్గి ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కొంత ఉపశమనం కలిగించాయి.
ALSO READ: PF ఖాతాదారుల అకౌంట్లోకి డబ్బులు.. కేంద్రం అప్డేట్
