తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రంగా పేరుగాంచిన భద్రాచలం సీతారామచంద్ర స్వామి ఆలయం అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆలయ సహజత్వానికి ఏమాత్రం భంగం కలగకుండా, పూర్తిగా ఆగమ శాస్త్రానికి అనుగుణంగా అభివృద్ధి పనులు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆలయ అభివృద్ధి ప్రణాళికలపై జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ విషయాన్ని స్పష్టంగా తెలియజేశారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇప్పటివరకు పూర్తయిన భూసేకరణను దృష్టిలో ఉంచుకుని ఆలయ అభివృద్ధికి సంబంధించిన పలు నమూనాలను ముఖ్యమంత్రి పరిశీలించి, సమగ్ర ప్రణాళికలపై దిశానిర్దేశం చేశారు.
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అభివృద్ధి పనులను దశల వారీగా చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. మొత్తం పనులను 3 దశల్లో పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా రాబోయే గోదావరి పుష్కరాలు ను దృష్టిలో ఉంచుకుని, అప్పటికి పూర్తిచేయాల్సిన పనులను ముందుగానే గుర్తించి తొలి దశ అభివృద్ధి ప్రణాళికలను రూపొందించాలని స్పష్టం చేశారు. ఈ దశలో చేపట్టాల్సిన పనులకు సంబంధించి ఖచ్చితమైన అంచనాలు రూపొందించి, సమయపాలనతో అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.
పుష్కరాల సందర్భంలో భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉన్నందున ఆలయ పరిసరాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ముఖ్యంగా గోదావరి నది తీరంలో పుష్కర ఘాట్ల నిర్మాణం, అభివృద్ధి పనులు వేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. 2027 మార్చి 31 నాటికి తొలి దశ పనులు పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగాలని ప్రభుత్వం స్పష్టమైన గడువు విధించింది.
అలాగే పుష్కరాలు పూర్తయ్యిన అనంతరం చేపట్టాల్సిన మిగతా అభివృద్ధి పనుల కోసం ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేయాలని, అంచనాలు రూపొందించాలని అధికారులకు సూచించారు. ఆలయ ఆధ్యాత్మికతకు భంగం కలగకుండా, సంప్రదాయాన్ని కాపాడుతూ ఆధునిక సదుపాయాలు కల్పించడం లక్ష్యంగా ఈ ప్రణాళికలు రూపొందించబడుతున్నాయి. ఈ సమీక్ష సమావేశంలో మంత్రులు కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ఎంపీలు వేం నరేందర్ రెడ్డి, బలరాం నాయక్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ALSO READ: మద్యంలో కూల్ డ్రింక్ కలుపుకుని తాగితే మీ ఒంట్లో జరిగేదిదే!
