* తెలంగాణలో పదో తరగతి పరీక్షలు రద్దు!
* ఒకటి నుంచి 12వ తరగతి వరకు ఏకీకృత విద్యా విధానం
* దూకుడుగా సీఎం రేవంత్ రెడ్డి
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చేందుకు రేవంత్ సర్కార్ గట్టిగా ప్రయత్నాలు ప్రారంభిస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి సమూల ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. జాతీయస్థాయిలో విద్యావ్యవస్థను అధ్యయనం చేసి తెలంగాణలో ప్రవేశపెడతామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణలో ఇకనుంచి టెన్త్ పరీక్షలను తొలగించనున్నట్లు కూడా సూత్రప్రాయంగా చెప్పుకొచ్చారు సీఎం రేవంత్. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు ఒకే విధానంలో విద్యాబోధన చేసేందుకు కసరత్తు జరుపుతున్నట్లు సమాచారం. జాతీయస్థాయిలో ప్లస్ 2 విధానం అమల్లో ఉంది. అదేవిధంగా తెలంగాణలో అమలు చేసేందుకు రేవంత్ సర్కార్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
ఎస్ ఎస్ సి సర్టిఫికెట్ బోర్డు రద్దు..
విద్యా వ్యవస్థ ప్రక్షాళనలో భాగంగా తెలంగాణలో సెకండరీ స్కూల్ సర్టిఫికెట్ బోర్డు తొలగించనున్నారు. పదో తరగతి పరీక్షలకు కూడా ఇకనుంచి పెట్టబోరని తెలుస్తోంది. విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పుల్లో భాగంగా తెలంగాణ సర్కార్ రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో 200 తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. నర్సిరి నుంచి 12వ తరగతి వరకు ఏకీకృత విధానం.. పదో తరగతి బోర్డు పరీక్షల రద్దు.. నిరంతర మూల్యాంకనం.. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్య ఆధారిత విద్య పై దృష్టి సారించింది తెలంగాణ సర్కార్.. వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రవ్యాప్తంగా 100 మండలాల్లో 200 అత్యున్నత ప్రమాణాలతో కూడిన పాఠశాలలను ఏర్పాటు చేయనుంది. నర్సిరెడ్డి నుంచి 12వ తరగతి వరకు ఒకే పాఠశాల ప్రాంగణంలో విద్యను అందించే విధానం అందుబాటులోకి రానుంది. ఇది విద్యార్థులపై భారాన్ని తగ్గిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.
ఇకపై నిరంతర మూల్యాంకనం..
ఇప్పటివరకు విద్యార్థి జీవితంలో పదో తరగతి కీలకం. కానీ సాంప్రదాయ పదో తరగతి బోర్డు పరీక్షలను బదులుగా.. నిరంతర మూల్యాంకనం ద్వారా విద్యార్థుల సామర్థ్యాన్ని అంచనా వేసి అందుకు అనుగుణంగా బోధన అందించేందుకు సిద్ధపడుతోంది. కాలేజీ ఎడ్యుకేషన్ పూర్తయిన వెంటనే ఉద్యోగం వచ్చేలా విద్యార్థుల్లో నైపుణ్యాన్ని అభివృద్ధి చేసే పాఠ్యాంశాలకు ఇకనుంచి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. విద్యాసంస్థలను పర్యవేక్షించేందుకు ప్రత్యేక నియంత్రణ సంస్థను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ బడులను ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా తీర్చిదిద్దడం, మౌలిక సదుపాయాల కల్పన, నాణ్యమైన విద్యను అందించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ మార్పులతోనే విద్యారంగంలో తెలంగాణ దేశంలోనే ఆదర్శంగా నిలుస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడుతున్నారు. మరి అందులో ఎంతవరకు సక్సెస్ అవుతారో చూడాలి.
