స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్గా నామకరణం
అహింసా మార్గంలో ఆంధ్ర రాష్ట్ర సాధనకు కృషి
58 రోజుల దీక్షకు గుర్తుగా 58 అడుగుల విగ్రహం
అమరావతి,క్రైమ్ మిర్రర్: అమరజీవి శ్రీపొట్టి శ్రీరాములు విగ్రహావిష్కరణ ఒక చరిత్ర అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అభివర్ణించారు. పొట్టి శ్రీరాములు విగ్రహానికి స్టాట్యూ ఆఫ్ శాక్రిఫైస్గా నామకరణం చేశామని చెప్పారు. అహింసా మార్గంలో ఆయన ఆంధ్ర రాష్టాన్ని సాధించారని గుర్తు చేశారు. పొట్టి శ్రీరాముల త్యాగం ఈ తరం వాళ్లు తెలుసుకోవాలన్నారు. రాజధాని అమరావతి పరిధిలోని తుళ్లూరులో అమరజీవి పొట్టి శ్రీరాముల 58 అడుగుల భారీ కాంస్య విగ్రహాన్ని సీఎం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలోఆయన మాట్లాడారు.
ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం అమరజీవి చేసిన 58 రోజుల ఆమరణ నిరాహార దీక్షకు గుర్తుగా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తుళ్లూరు సమీపంలో 6.8 ఎకరాల్లో నిర్మిస్తున్న స్మృతివనంలో అమరజీవి 125వ జయంతి వేడుకలను భారీస్థాయిలో నిర్వహించడానికి ఆర్యవైశ్య సంఘాలు, ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. పొట్టి శ్రీరాములు విగ్రహం కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు ధన్యవాదాలు తెలిపారు.
రాజధాని అమరావతి పూర్తయితే ఈ విగ్రహం మరింత అద్భుతంగా కనిపిస్తుందని అన్నారు. అదే విధంగా స్ఫూర్తికి మారు పేరు ఆర్యవైశ్య సంఘమని పేర్కొన్నారు. మహాత్మా గాంధీ నాయకత్వంలో పొట్టి శ్రీరాములు పనిచేశారని తెలిపారు. పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ చేసి రాష్టాన్ని సాధించి పెట్టారని చెప్పారు. ఇక రాజధాని అమరావతి నిర్మాణంలో ఎంతోమంది రైతుల త్యాగం ఉందన్నారు.
రాజధాని నిర్మాణానికి 29 వేల మంది రైతులు 33 వేల ఎకరాల భూమి ఇచ్చారని గుర్తు చేశారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా భారీ ల్యాండ్ పూలింగ్కు సహకరించారని వివరించారు. రాజధాని లేని రాష్ట్రంలో వైసీపీ.. మూడు ముక్కలాట ఆడిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిని గత పాలకులు స్మశానం అని అవహేళన చేశారని తెలిపారు. పొట్టి శ్రీరాములు 58 రోజుల దీక్షకు గుర్తుగా 58 అడుగుల ఆయన భారీ విగ్రహం ఏర్పాటు చేశామన్నారు.
6 నెలల్లో మొదటి దశ పనులు పూర్తి చేశారని వివరించారు. రెండో దశ పనులను కూడా త్వరలో పూర్తి చేస్తామన్నారు. ఈ విగ్రహం కోసం 26 టన్నుల కాంస్యం, 42 టన్నుల ఐరన్ వినియోగించారని సీఎం చంద్రబాబు చెప్పారు. గత ప్రభుత్వం పాలనతో బ్రాండ్ దెబ్బతిన్నదని.. తెలుగు జాతి ఇబ్బంది పడిందని గుర్తించి తాను, పవన్ కళ్యాణ్ ఇద్దరం కలసి నిలబడి బీజేపీతో కలిసి కూటమిగా జత కట్టామని వివరించారు. గత ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును విధ్వంసం చేసిందన్నారు.
2027 గోదావరి పుష్కరాలకంటే ముందు పోలవరాన్ని జాతికి అంకితం చేస్తామని ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, రాష్ట్ర మంత్రులు నారా లోకేశ్, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, టీజీ భరత్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తదితరులు పాల్గొన్నారు.
