Air India Employees Free Flight Ticket Misuse: ఎయిర్ ఇండియా ఉద్యోగులకు ఇచ్చే ఉచిత విమాన టికెట్ల సదుపాయాన్ని కొందరు దుర్వినియోగం చేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. సంస్థ నిర్వహించిన అంతర్గత విచారణలో ఈ విషయం బయటపడింది. ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల కోసం అమలు చేస్తున్న ఎంప్లాయీ లీజర్ ట్రావెల్ పాలసీ కింద ఇచ్చే ఉచిత టికెట్లను కొందరు అధిక ధరలకు విక్రయించినట్టు గుర్తించారు.
టిక్కెట్లను అమ్ముకున్న ఉద్యోగులు
ఈ పాలసీ ప్రకారం ఉద్యోగులు, వారి జీవిత భాగస్వాములు, తల్లిదండ్రులకు ప్రతి సంవత్సరం నిర్దిష్ట సంఖ్యలో ఉచిత విమాన ప్రయాణ టికెట్లు అందజేస్తారు. అయితే కొందరు ఉద్యోగులు ఈ అవకాశాన్ని తప్పుగా ఉపయోగించుకున్నారు. తమ కుటుంబ సభ్యులు కాని వ్యక్తులను బంధువులుగా చూపించి టికెట్లు బుక్ చేసి, తర్వాత వాటిని ఇతరులకు అమ్మినట్టు సంస్థ గుర్తించింది. మరికొందరు ఈ టికెట్లను నేరుగా అధిక ధరలకు విక్రయించినట్లు విచారణలో వెల్లడైంది.
4 వేల మంది ఉద్యోగులపై చర్యలు
ఎయిర్ ఇండియా సంస్థ సమాచారం ప్రకారం.. 4 వేల మందికి పైగా ఉద్యోగులు ఈ పాలసీని దుర్వినియోగం చేసినట్టు తేలింది. దీనిపై సంస్థ కఠిన చర్యలు చేపట్టింది. సంబంధిత ఉద్యోగులపై జరిమానాలు విధించడంతో పాటు, వారు మోసపూరితంగా పొందిన మొత్తాన్ని తిరిగి చెల్లించాలని ఆదేశించింది. అయితే ఎంతమంది ఉద్యోగులు టికెట్లు విక్రయించారు, ఎన్ని టికెట్లు అమ్మబడ్డాయి, ఎంత మొత్తంలో డబ్బు సంపాదించారన్న వివరాలు ఇంకా వెల్లడించలేదు.
లీజర్ ట్రావెల్ పాలసీ నింబంధనలకు కఠినతరం
ఈ ఘటన తర్వాత సంస్థ లీజర్ ట్రావెల్ పాలసీ నిబంధనలను మరింత కఠినతరం చేసింది. ఇక నష్టాల్లో ఉన్న ఎయిర్ ఇండియాను 2022లో Tata Group స్వాధీనం చేసుకుంది. ప్రస్తుతం సంస్థలో సుమారు 24 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.
