క్రైమ్ మిర్రర్ : నేపాల్–టిబెట్ సరిహద్దు ప్రాంతంలో సంభవించిన ఆకస్మిక వరదలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. కైలాశ్ మానససరోవర్ యాత్ర ముగించుకుని తిరుగు ప్రయాణంలో ఉన్న ఈశా ఫౌండేషన్కు చెందిన బృందంలోని 80 మందితో సంబంధాలు తెగిపోయినట్లు సమాచారం. వీరిలో 77 మంది యాత్రికులు, ముగ్గురు వాలంటీర్లు ఉన్నట్లు తెలుస్తోంది.
టిబెట్లోని గ్యిరాంగ్ ప్రాంతంలోని ఇమిగ్రేషన్ కేంద్రం వద్ద ఈశా యాత్రికుల బృందం ఉన్న సమయంలో ఒక్కసారిగా వరదలు ముంచెత్తినట్లు సద్గురు జగ్గా వాసుదేవ్ తెలిపారు. బృంద నాయకుడు ప్రవీణ్ ఉదయం 9.05 గంటలకు తాము ఇమిగ్రేషన్ కేంద్రానికి చేరుకున్నట్లు సందేశం పంపారని, ఆ తర్వాత కొద్ది నిమిషాలకే, 9.14 గంటల సమయంలో వరదలు ఆ ప్రాంతాన్ని ముంచెత్తినట్లు ఆయన వెల్లడించారు.
ఈ ఘటనపై మాట్లాడుతున్న సమయంలో సద్గురు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. గల్లంతైన వారి పరిస్థితిపై ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి సమాచారం తమకు అందలేదని తెలిపారు. కమ్యూనికేషన్ వ్యవస్థలు దెబ్బతినడంతో వారిని నేరుగా సంప్రదించలేకపోతున్నామని చెప్పారు. గల్లంతైన యాత్రికుల ఆచూకీ కోసం తాను కొంతమంది వాలంటీర్లతో కలిసి గ్యిరాంగ్ ప్రాంతానికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్లు సద్గురు వెల్లడించారు. ఇందుకోసం భారత్, చైనా అధికారుల నుంచి అవసరమైన అనుమతులు పొందేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని తెలిపారు.
మరోవైపు, సరిహద్దు ప్రాంతంలో భారీ వర్షాలు, వరదల కారణంగా సహాయక చర్యలకు తీవ్ర ఆటంకాలు ఎదురవుతున్నాయి. దెబ్బతిన్న రహదారులు, ప్రతికూల వాతావరణ పరిస్థితులు, కమ్యూనికేషన్ వ్యవస్థల్లో అంతరాయాలు రెస్క్యూ బృందాలకు సవాలుగా మారాయి. గల్లంతైన యాత్రికుల ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు, సహచరులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.
also read : చిలుకలూరు రోడ్డు ప్రమాదం బాధాకరం….!పవన్ కల్యాణ్
