క్రైమ్ మిర్రర్ : అల్లూరి సీతారామరాజు జిల్లాలోని చింతూరు పోలీస్స్టేషన్లో ముగ్గురు మావోయిస్టులు లొంగిపోయారు. చింతూరు ఓఎస్డీ పంకజ్ కుమార్ మీనా సమక్షంలో వారు పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. లొంగిపోయిన వారిలో ఒక మహిళ కూడా ఉన్నట్లు తెలిపారు. లొంగిపోయిన వారిని ముచ్చిక లక్ష్మి, కదిటి వెంక, కదిటి లక్షయ్యగా గుర్తించారు. వీరు ఛత్తీస్గఢ్ కేంద్రంగా మావోయిస్టు కార్యకలాపాల్లో కొనసాగినట్లు పోలీసులు తెలిపారు. గతంలో పలు హింసాత్మక ఘటనలతో వీరికి సంబంధం ఉన్నట్లు పేర్కొన్నారు. వారి పేర్లపై వివిధ కేసులు నమోదై ఉన్నాయని వెల్లడించారు. హింసాయుత మార్గాన్ని వీడి సాధారణ జనజీవనంలోకి రావాలనే ఉద్దేశంతో ముగ్గురూ స్వచ్ఛందంగా పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు ఓఎస్డీ పంకజ్ కుమార్ మీనా తెలిపారు. ప్రభుత్వ పునరావాస విధానాల ప్రకారం వారికి అందించాల్సిన సహాయంపై పరిశీలన చేస్తామని ఆయన పేర్కొన్నారు.
మావోయిస్టుల లొంగుబాటుకు దారితీసిన పరిణామాలు
మావోయిస్టు ప్రభావాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ నేపథ్యంలో భద్రతా బలగాల చర్యలు ముమ్మరమయ్యాయి. ముఖ్యంగా ఛత్తీస్గఢ్లోని ప్రభావిత ప్రాంతాల్లో కూంబింగ్ ఆపరేషన్లు కొనసాగుతున్నాయి. ఈ చర్యల నేపథ్యంలో పలువురు మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోగా, మరికొందరు అరెస్టయ్యారు. భద్రతా బలగాల ఆపరేషన్లలో పలువురు మావోయిస్టులు మృతి చెందినట్లు కూడా అధికారులు వెల్లడించారు. మావోయిస్టు నిర్మూలనలో ఆపరేషన్ కగార్ గణనీయమైన ఫలితాలు సాధించిందని కేంద్రం పేర్కొంది.
also read : మద్యం మత్తులో మహిళల హల్చల్.. యువకులపై దాడి
