క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : అనారోగ్యంతో బాధపడుతున్న రోజుల పసికందుకు నిర్దయగా వదిలేసి వెళ్లిపోయారు తల్లిదండ్రులు. ఈ దారుణ ఘటన నగరంలోని నాంపల్లి నీలోఫర్ ఆస్పత్రిలో చోటు చేసుకుంది. ఒడిశాకు చెందిన దంపతులు తమ ఆరు రోజుల మగ శిశువును ఆస్పత్రిలో చేర్చారు. శిశువు శ్వాసకోస సమస్యతో బాధపడుతున్నాడు. ఏప్రిల్ 25న శిశువును నీలోఫర్లో చేర్చిన తల్లిదండ్రులు అక్కడి నుంచి అదృశ్యమయ్యారు. పసికందుకు సంబంధించిన వారు ఎవరూ లేకపోవడంతో ఆస్పత్రి సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పసికందును నీలోఫర్ ఆస్పత్రి వైద్యులు ఎంతో జాగ్రత్తగా చూసుకున్నారు. ఎన్బీసీయూలో చికిత్స అందించి.. శిశువును కాపాడారు. ఆసుపత్రి ఆర్ఎంఓ ఫిర్యాదు మేరకు నాంపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పసికందును సంరక్షణ కోసం శిశు విహార్కు తరలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. శిశువు తల్లిదండ్రులను త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు.