క్రైమ్ మిర్రర్, సెంట్రల్ డెస్క్ : పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఊహించని భారీ ఊపుడు వచ్చింది. తృణమూల్ కాంగ్రెస్ (TMC) అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి అత్యంత ఆప్తురాలైన బెంగాల్ టీఎంసీ రాష్ట్ర అధ్యక్షురాలు చంద్రమా భట్టాచార్య తన పదవికి, అలాగే పార్టీలోని అన్ని రకాల బాధ్యతలకు రాజీనామా చేశారు. ఈ హఠాత్ పరిణామం టీఎంసీ పార్టీలో తీవ్ర కలకలం రేపుతోంది. మమతా బెనర్జీకి పంపిన అధికారిక లేఖలో చంద్రమా భట్టాచార్య తన నిర్ణయాన్ని స్పష్టం చేశారు. 2026 జూన్ 3న కాళీఘాట్లో జరిగిన కీలక సమావేశంలో తనకు అప్పగించిన అఖిల భారత తృణమూల్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ఆమె పేర్కొన్నారు.
కేవలం అధ్యక్ష పదవి మాత్రమే కాకుండా, పార్టీలో తాను నిర్వహిస్తున్న అన్ని అనుబంధ, ఇతర సంస్థాగత బాధ్యతల నుంచి కూడా పూర్తిగా తప్పుకుంటున్నట్లు లేఖలో స్పష్టం చేశారు. అంతేకాకుండా, పార్టీకి సంబంధించిన ఆర్థిక వ్యవహారాల నుంచి కూడా ఆమె వైదొలిగారు. ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్తో పాటు దానికి అనుబంధంగా ఉన్న పలు విభాగాలు వివిధ బ్యాంకుల్లో నిర్వహిస్తున్న ఖాతాలకు ‘అధీకృత సంతకం’ చేసే బాధ్యతను కూడా వదులుకుంటున్నట్లు వెల్లడించారు. దీంతో పాటు, భారత ఎన్నికల సంఘం ముందు పార్టీ తరఫున వ్యవహరించే అధీకృత ప్రతినిధి పాత్రకు ఇచ్చిన సమ్మతిని కూడా ఆమె ఉపసంహరించుకున్నారు.
అయితే, చంద్రమా భట్టాచార్య తన రాజీనామాకు గల ఖచ్చితమైన కారణాలను ఎక్కడా ప్రస్తావించలేదు. మమతా బెనర్జీకి అత్యంత విశ్వసనీయమైన, బలమైన నాయకురాలిగా గుర్తింపు పొందిన చంద్రమా.. ఇలా ఒక్కసారిగా అన్ని పదవుల నుంచి, ఆర్థిక బాధ్యతల నుంచి తప్పుకోవడం వెనుక పార్టీ అంతర్గత విభేదాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో చర్చలు నడుస్తున్నాయి. ఈ హఠాత్ రాజీనామాపై తృణమూల్ కాంగ్రెస్ అధిష్టానం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేదా స్పందన రాలేదు. బెంగాల్ రాజకీయాల్లో కీలక భూమిక పోషిస్తున్న చంద్రమా భట్టాచార్య నిర్ణయం.. రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయ సమీకరణాలను ఏ విధంగా మార్చబోతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.