వరంగల్ జిల్లా ధర్మారం ప్రాంతంలో విషాద ఘటన చోటుచేసుకుంది. భర్త వేధింపులు తట్టుకోలేక ఓ 21 ఏళ్ల వివాహిత ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఒడిశాకు చెందిన గుప్తేశ్వర్ బిష్యాన్కు ఆయన మేనకోడలు మిల్లీ బిస్వాస్తో ఈ ఏడాది జూన్ 14న పూరి జగన్నాథ ఆలయంలో వివాహం జరిగింది. పెళ్లి అనంతరం ఇద్దరూ ధర్మారంలో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు.
అయితే భార్యపై అనుమానంతో గుప్తేశ్వర్ తరచూ వేధింపులకు గురిచేసేవాడని పోలీసులు వెల్లడించారు. ఈ నెల 8న మిల్లీ తన తల్లికి ఫోన్ చేసి భర్త తనను ఇంటి నుంచి వెళ్లిపోవాలని, లేదంటే చనిపోవాలని చెబుతున్నాడంటూ కన్నీటితో వాపోయినట్లు సమాచారం. ఆ తర్వాత కొద్దిసేపటికే ఆమె ఆత్మహత్యకు పాల్పడింది.
మిల్లీ మృతిపై బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు ఆధారంగా భర్త గుప్తేశ్వర్ బిష్యాన్పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తున్నారు.
also read: హైదరాబాద్లో శంకర్పై మళ్లీ రౌడీషీట్.. బెదిరింపుల కేసులతో పోలీసుల చర్యలు
