అస్సాంలోని గౌహతిలో భార్య హత్య కేసులో అరెస్టైన ఓ వ్యక్తి పోలీసు కస్టడీలో మృతి చెందడం కలకలం రేపింది. రామానుజ్ గోస్వామి అనే వ్యక్తి భార్య రియా తాలుక్దార్ (25) హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడు.
సెప్టెంబర్ 3న బసిష్ఠపూర్లోని ఓ ఫ్లాట్లో రియా తాలుక్దార్ మృతదేహం లభించింది. ఆమెను రామానుజ్ హత్య చేసినట్లు ఆరోపణలు రావడంతో పోలీసులు సెప్టెంబర్ 6న అతడిని అరెస్టు చేశారు.
అరెస్టు అనంతరం రామానుజ్కు వైద్య పరీక్షలు నిర్వహించిన పోలీసులు.. అనంతరం అతడిని తిరిగి తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో నరకాసుర్ హిల్ ప్రాంతంలో పోలీసులపై అతడు దాడికి ప్రయత్నించి, కదులుతున్న పోలీసు వాహనం నుంచి దూకినట్లు అధికారులు వెల్లడించారు.
వాహనం నుంచి దూకడంతో రామానుజ్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత అతడి మృతికి సంబంధించిన పూర్తి కారణాలు స్పష్టమయ్యే అవకాశం ఉంది.
also read: కొబ్బరి చిప్పలో గణనాథుడు.. ఉపాధ్యాయుడి సృజనాత్మకతకు ఫిదా
