తెలంగాణ మట్టిలో దాగి ఉన్న సహజ సంపద మరోసారి వెలుగులోకి వచ్చింది. సంగారెడ్డి జిల్లాలోని పర్వతపూర్ ప్రాంతంలో ఉన్న అరుదైన, విలువైన ఖనిజ గనులను కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన NLC ఇండియా లిమిటెడ్ దక్కించుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ గనుల వేలంపాటలో సంస్థను ప్రాధాన్య బిడ్డర్గా ఎంపిక చేసినట్లు అధికారికంగా వెల్లడైంది.
జహీరాబాద్కు సమీపంలో ఉన్న పర్వతపూర్ బ్లాక్లో వెనేడియం, టైటానియం, అల్యూమినస్ లాటరైట్ వంటి కీలక ఖనిజ నిక్షేపాలు ఉన్నట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గుర్తించింది. ఈ నేపథ్యంలో కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ-వేలంపాట నిర్వహించగా, NLC ఇండియా లిమిటెడ్ ఈ గనులను పొందింది.
ఈ ప్రాంతంలో సుమారు 15.25 మిలియన్ టన్నుల వెనేడియం నిల్వలు ఉన్నట్లు అంచనా. అంతేకాకుండా 87 మిలియన్ టన్నుల వరకు అల్యూమినస్ లాటరైట్ నిక్షేపాలు ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. మొత్తం 335 హెక్టార్లకు పైగా విస్తరించిన ఈ గని ప్రాజెక్ట్ భవిష్యత్తులో కీలక పాత్ర పోషించే అవకాశముంది.
వెనేడియం వంటి ఖనిజం అత్యంత అరుదైనదిగా భావించబడుతుంది. దీన్ని ఉక్కు బలాన్ని పెంచేందుకు, అధిక సామర్థ్యం కలిగిన బ్యాటరీల తయారీలో ఉపయోగిస్తారు. అలాగే టైటానియం మరియు ఇతర ఖనిజాలు రక్షణ రంగానికి అత్యంత అవసరమైనవి. విమానాల తయారీ, రాకెట్లు, ఆధునిక ఆయుధ వ్యవస్థల్లో ఇవి విస్తృతంగా వినియోగంలో ఉన్నాయి.
ఈ గనుల అభివృద్ధితో తెలంగాణలో పారిశ్రామిక అభివృద్ధి వేగవంతం కావడంతో పాటు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని నిపుణులు భావిస్తున్నారు. అంతేకాకుండా దేశీయంగా అరుదైన ఖనిజాల లభ్యత పెరగడం వల్ల దిగుమతులపై ఆధారపడటం తగ్గే అవకాశం ఉంది.
also read: ‘లెనిన్’ విడుదల మళ్లీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన నాగార్జున