క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : తెలంగాణలోని వివిధ కమిషనరేట్ల పరిధిలో గంజాయి, డ్రగ్స్ వినియోగంపై భారీగా ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం ఈగల్ ఫోర్స్ పలు ప్రాంతాల్లో ఏక కాలంలో దాడుల నిర్వహించింది. ఈ సందర్భంగా 19 మందిని ఈగల్ ఫోర్స్ అదుపులోకి తీసుకుంది. వారికి వైద్య పరీక్షలు నిర్వహించగా.. వారిలో 14 మందికి గంజాయి పాజిటివ్, మరో వ్యక్తికి గంజాయితోపాటు డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. పట్టుబడిన వారందరూ డ్రగ్స్ వినియోగించినట్లు విచారణలో అంగీకరించారని ఈగల్ ఫోర్స్ వెల్లడించింది. వీరందరిని డీ అడిక్షన్ సెంటర్లకు తరలించామని పేర్కొంది. వీరి తల్లిదండ్రులకు సమాచారం అందించామని తెలిపింది. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి, ఫ్యూచర్ సిటీ కమిషనరేట్లతో పాటు మహబూబ్నగర్, నిజామాబాద్ జిల్లాల్లో ఈగల్ ఫోర్స్ ఈ దాడులు చేసింది. ఈగల్ పోర్స్15 బృందాలను ఏర్పాటు చేసి వారి సమన్వయంతో ఈ ఆపరేషన్ నిర్వహించారు. ఈ విచారణలో గంజాయి, డ్రగ్స్ తీసుకున్న వారి నుంచి ఈగల్ ఫోర్స్ పలు కీలక విషయాలు రాబట్టింది. గోవాలోని వగటోర్ బీచ్ ప్రాంతంలో ఒక ముఠా హాస్టల్ తీసుకుని కొకైన్, ఎండీఎంఏ, ఎల్ఎస్డీ, హ్యాష్ ఆయిల్ సరఫరా చేస్తున్నట్లు గుర్తించింది. వాటిని బెంగళూరు, గోవా నుంచి హైదరాబాద్కు రవాణా చేస్తున్నట్లు కనుక్కొంది. సినీ పరిశ్రమలోని పలువురికి వీటిని విక్రయించినట్లు ఈ దర్యాప్తులో వెల్లడైంది. సాంకేతిక విశ్లేషణ ద్వారా మొత్తం 44 మంది వినియోగదారులను ఈగల్ ఫోర్స్ గుర్తించింది. ఈ డ్రగ్స్ వినియోగదారులు హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకతోపాటు గోవాలో ఉన్నట్లు ఈ విచారణలో ఈగల్ టీం కనుక్కొంది. డ్రగ్స్ కొనుగోలు కోసం వినియోగదారులు చక్రపాణి, హర్షిత్ రెడ్డిల ఖాతాలకు రూ.3.13 లక్షలకుపైగా నగదు బదిలీ అయినట్లు గుర్తించింది. 2019 లో వీరిద్దరు ఎన్డీపీఎస్ కేసులో అరెస్టయినట్లు ఈగల్ టీం వెల్లడించింది.