హైదరాబాద్, క్రైమ్ మిర్రర్: ఐఆర్సీటీసీ భక్తులు, పర్యాటకుల కోసం మరో ఆకర్షణీయమైన టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. దివ్య దక్షిణ యాత్ర విత్ అరుణాచలం పేరుతో రూపొందించిన ఈ ప్రత్యేక ప్యాకేజీ ద్వారా దక్షిణ భారతదేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను తక్కువ ఖర్చుతో సందర్శించే అవకాశం కల్పిస్తోంది.
ఈ యాత్ర జూలై 20న ప్రారంభమై 8 రాత్రులు, 9 రోజుల పాటు కొనసాగుతుంది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు ద్వారా ఈ ప్రయాణం సాగనుంది. రామేశ్వరం, కన్యాకుమారి, అరుణాచలం సహా మొత్తం ఏడు ప్రముఖ ఆధ్యాత్మిక ప్రాంతాలను ఈ టూర్లో కవర్ చేయనున్నారు.
తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు అనుకూలంగా సికింద్రాబాద్ నుంచి ఈ రైలు బయలుదేరనుంది. సికింద్రాబాద్, చార్లపల్లి, జనగాం, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, మధిర, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట వంటి పలు స్టేషన్లలో ఎక్కే సౌకర్యం కల్పించారు.
ఈ ప్రత్యేక రైలులో స్లీపర్, 3ఏసీ, 2ఏసీ కోచ్లు అందుబాటులో ఉన్నాయి. మొత్తం 702 మంది ప్రయాణికులు ప్రయాణించేందుకు ఏర్పాట్లు చేశారు. స్లీపర్ క్లాస్లో 160 సీట్లు, 3ఏసీలో 490 సీట్లు, 2ఏసీలో 52 సీట్లు కేటాయించారు.
ఈ టూర్ ప్యాకేజీ ధర రూ.15,600 నుంచి ప్రారంభమవుతోంది. ప్రయాణంతో పాటు వసతి, భోజనం, స్థానిక రవాణా వంటి పలు సౌకర్యాలు కూడా ప్యాకేజీలో భాగంగా ఉండనున్నాయి.
తక్కువ బడ్జెట్లో కుటుంబంతో కలిసి దక్షిణ భారతదేశంలోని ప్రముఖ ఆలయాలు, ఆధ్యాత్మిక కేంద్రాలు, పర్యాటక ప్రాంతాలు సందర్శించాలని భావించే వారికి ఈ ప్యాకేజీ మంచి అవకాశం అని చెప్పొచ్చు. ఐఆర్సీటీసీ అందిస్తున్న ఈ యాత్రకు ఇప్పటికే మంచి స్పందన లభిస్తున్నట్లు సమాచారం. త్వరగా బుకింగ్ చేసుకుంటే సీట్లు పొందే అవకాశం ఉంటుంది.