క్రైమ్ మిర్రర్ : కేంద్రపాలిత ప్రాంతం లడఖ్లో గురువారం భూకంపం కలకలం రేపింది. లేహ్ పరిసర ప్రాంతాల్లో కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే రెండుసార్లు భూమి కంపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వరుస ప్రకంపనల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తమయ్యారు. గురువారం ఉదయం సుమారు 6 గంటల సమయంలో లడఖ్ ప్రాంతంలో తొలి భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.5గా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ప్రకంపనలు కొంతసేపు కొనసాగడంతో పలు ప్రాంతాల్లో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చినట్లు సమాచారం.
తొలి భూకంపం ప్రభావం నుంచి ప్రజలు తేరుకోకముందే మరోసారి భూమి కంపించింది. ఉదయం 9.54 గంటల సమయంలో రెండో భూకంపం సంభవించింది. ఈ ప్రకంపనల తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.3గా నమోదైంది. వరుసగా రెండుసార్లు భూమి కంపించడంతో ప్రజల్లో ఆందోళన మరింత పెరిగింది. భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ (NCS) వెల్లడించింది. అయితే ఈ రెండు భూకంపాల కారణంగా ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం లేదా ఆస్తినష్టం సంభవించినట్లు సమాచారం లేదని అధికారులు తెలిపారు.
లడఖ్ భౌగోళికంగా భూకంపాలు సంభవించే ప్రాంతాల్లో ఒకటిగా ఉంది. హిమాలయ ప్రాంతంలో భౌగోళిక పలకల కదలికల కారణంగా ఇక్కడ తరచూ స్వల్ప, మధ్యస్థ తీవ్రతతో ప్రకంపనలు నమోదవుతుంటాయి. దీంతో అధికారులు ఎప్పటికప్పుడు భూకంప కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నారు. గురువారం ఒకే రోజు గంటల వ్యవధిలో రెండు ప్రకంపనలు నమోదవడంతో స్థానికుల్లో కొంత ఆందోళన నెలకొంది. అయితే ప్రస్తుతం ఎలాంటి నష్టం నమోదు కాకపోవడంతో అధికారులు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. భవిష్యత్తులో మరిన్ని ప్రకంపనలు నమోదయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
also read : కదిరిలో హైడ్రామా.. పోలీసుల అరెస్ట్కు ముందే కుటుంబం ఆత్మహత్యాయత్నం
