Bengal Poll Row: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత రాజకీయ ఉద్రిక్తత మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ఈసీపై తీవ్ర ఆరోపణలు చేశారు. బీజేపీ నిజాయితీగా గెలవలేదని, ఎన్నికల ప్రక్రియలో కుట్రలు జరిగాయని విమర్శించారు. ఎన్నికల సంఘం కూడా బీజేపీకి అనుకూలంగా వ్యవహరించిందని ఆరోపిస్తూ, ఈ ఎన్నికల్లో ప్రధాన విలన్ అదే అని విమర్శించారు.
రాజీనామా చేసే ప్రసక్తి లేదు!
తాను ఎన్నికల్లో ఓడిపోలేదని, అందువల్ల రాజీనామా చేసే ప్రశ్నే లేదని మమత స్పష్టం చేశారు. ఎవరూ తనపై ఒత్తిడి తేవలేరని, రాజ్భవన్కు వెళ్లే ఉద్దేశం కూడా లేదని చెప్పారు. ఎన్నికల ఫలితాల అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె ఈసీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల నిర్వహణలో అనేక అనుమానాస్పద అంశాలు ఉన్నాయని ఆరోపించారు. ముఖ్యంగా ఈవీఎంల వినియోగంపై ప్రశ్నలు లేవనెత్తారు. పోలింగ్ పూర్తయ్యాక కూడా యంత్రాల్లో ఎక్కువ శాతం చార్జ్ ఎలా ఉందని ఆమె ప్రశ్నించారు. అదేవిధంగా పోలింగ్ కు ముందు తమ పార్టీ కార్యకర్తలపై దాడులు జరిగాయని, అరెస్టులు చేశారని అన్నారు.
ప్లాన్ చేసి నన్ను ఓడించారు!
భవానీపూర్లో తన ఓటమి కూడా యాదృచ్ఛికం కాదని, ముందుగానే ప్లాన్ చేసి ఓడించారని మమత అభిప్రాయపడ్డారు. కౌంటింగ్ సెంటర్ల వద్ద తమ పార్టీ కార్యకర్తలపై దాడులు జరిగాయని, కేంద్ర బలగాలు కూడా దుర్మార్గంగా వ్యవహరించారని ఆరోపించారు. కోట్లాది ఓట్లను తొలగించి, తర్వాత కొంతమేర తిరిగి చేర్చారని, మొత్తం మీద బీజేపీకి అనుకూలంగా పరిస్థితులు సృష్టించారని విమర్శించారు. ఈ పరిస్థితుల్లో కూడా తాను వెనక్కి తగ్గబోనని మమత స్పష్టం చేశారు. జాతీయ స్థాయిలో ‘ఇండియా’ కూటమి తనకు మద్దతుగా నిలుస్తోందని తెలిపారు. ఈ ఎన్నికల ఫలితాలను తాను అంగీకరించలేనని, అయినప్పటికీ రాజకీయంగా పోరాటం కొనసాగిస్తానని మమతా బెనర్జీ స్పష్టం చేశారు.