-
కమర్షియల్ గ్యాస్ సిలిండర్పై భారీ ఊరట..
-
రూ.183.50 తగ్గిన ధరలు.. నేటి నుంచే అమలు!
Crime Mirror,Latest Updates: ఎల్పీజీ వినియోగదారులకు చమురు సంస్థలు శుభవార్త చెప్పాయి. జూలై 1 నుంచి 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరపై ఏకంగా రూ.183.50 తగ్గింపు ప్రకటించాయి. ఈ ఏడాదిలో కమర్షియల్ సిలిండర్ ధరలు తగ్గడం ఇదే తొలిసారి కావడం విశేషం. అయితే 14.2 కిలోల గృహ వినియోగ సిలిండర్ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు చేయలేదు.
ఇటీవల అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గి, అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు పడిపోవడంతో దేశీయంగా కూడా ఎల్పీజీ ధరలపై ప్రభావం కనిపించింది. దీంతో చమురు మార్కెటింగ్ సంస్థలు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి.
కొత్త ధరల ప్రకారం ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర రూ.3,113.50 నుంచి రూ.2,930కు చేరింది. లక్నోలో రూ.3,236 నుంచి రూ.3,052.50కు, కోల్కతాలో రూ.3,255.50 నుంచి రూ.3,081.50కు తగ్గింది. హైదరాబాద్లో కూడా కమర్షియల్ సిలిండర్ ధర గణనీయంగా తగ్గనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఢిల్లీలో గృహ వినియోగ 14.2 కిలోల సిలిండర్ ధర రూ.942గానే కొనసాగుతుండగా, లక్నోలో రూ.979.50, కోల్కతాలో రూ.968గా యథాతథంగా ఉంది.
గత కొన్ని నెలలుగా కమర్షియల్ సిలిండర్ ధరలు వరుసగా పెరుగుతూ వచ్చాయి. ముఖ్యంగా మే నెలలో భారీగా పెరగగా, జూన్లో కూడా మరోసారి ధరలు పెరిగాయి. ఇప్పుడు మొదటిసారి భారీ తగ్గింపు రావడంతో హోటళ్లు, రెస్టారెంట్లు, క్యాటరింగ్ వ్యాపారులు, చిన్న వ్యాపారులకు కొంత ఊరట లభించనుంది.
ఇక గృహ వినియోగ సిలిండర్ ధరలు మాత్రం మార్చి, జూన్ నెలల్లో పెరిగిన తర్వాత ప్రస్తుతం స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈసారి ధరలను పెంచకుండా యథాతథంగా ఉంచడం గృహ వినియోగదారులకు కొంత ఉపశమనంగా భావిస్తున్నారు. అయితే కమర్షియల్ సిలిండర్ ధర తగ్గడంతో వ్యాపార రంగంపై ఖర్చుల భారం కొంత తగ్గే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.