స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ చేసిన ఓ సోషల్ మీడియా పోస్టు చర్చనీయాంశంగా మారింది. జాతీయ పర్వదినాన్ని పురస్కరించుకుని ఆయన ఎర్రకోటను బ్యాక్డ్రాప్గా చూపిస్తూ త్రివర్ణ పతాకంతో కూడిన ఓ చిత్రాన్ని షేర్ చేసినట్లు తెలుస్తోంది.
అయితే ఆ చిత్రంలోని జాతీయ జెండాలో అశోక చక్రం కనిపించకపోవడంపై కొందరు నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. జాతీయ జెండాను ఉపయోగించే విషయంలో మరింత జాగ్రత్త తీసుకోవాల్సిందని కామెంట్లు చేశారు. మరోవైపు.. పోస్టులో అల్లు అర్జున్కు సంబంధించిన ‘AA’ లోగో మాత్రం స్పష్టంగా ఉండటాన్ని ప్రస్తావిస్తూ కొందరు సోషల్ మీడియా యూజర్లు విమర్శలు గుప్పించారు.
ఈ అంశంపై సోషల్ మీడియాలో చర్చ కొనసాగుతుండగానే.. ఆ పోస్టు ప్రస్తుతం అల్లు అర్జున్ సోషల్ మీడియా ఖాతాలో కనిపించకపోవడం ఆసక్తికరంగా మారింది. దీంతో విమర్శల నేపథ్యంలోనే పోస్టును తొలగించారా? అనే చర్చ మొదలైంది. అయితే పోస్టు ఎందుకు తొలగించారనే దానిపై అల్లు అర్జున్ లేదా ఆయన టీమ్ నుంచి అధికారిక వివరణ వెలువడలేదు.
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా చేసిన ఓ సాధారణ సోషల్ మీడియా పోస్టు.. జాతీయ జెండా రూపకల్పనపై నెటిజన్ల అభ్యంతరాలతో ఇలా చర్చకు దారితీసింది.
also read: భాగ్యశ్రీ బోర్సేకు మరో బిగ్ ఆఫర్.. నాని ‘బ్లడీ రోమియో’లో హీరోయిన్గా ఛాన్స్?
