ఆదిలాబాద్ జిల్లా బోథ్లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చిన్నారిపై ఉపాధ్యాయురాలు దాడి చేసిన ఘటన కలకలం రేపుతోంది. నర్సరీ చదువుతున్న నాలుగేళ్ల బాలుడిని లేడీ టీచర్ విచక్షణారహితంగా కొట్టిన దృశ్యాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి.
సీసీటీవీ దృశ్యాల్లో టీచర్ చిన్నారి చెవి మెలితిప్పడంతో పాటు కర్రతో కొడుతున్నట్లు కనిపించింది. అంతేకాకుండా చెంపలు, వీపుపై కూడా దాడి చేసినట్లు సమాచారం. ఈ ఘటనలో బాలుడికి గాయాలు కావడంతో తల్లిదండ్రులు ఆరా తీశారు.
అసలు ఏం జరిగిందో తెలుసుకునేందుకు పాఠశాలలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా టీచర్ దాడి చేసిన విషయం బయటపడింది. దీంతో ఆగ్రహానికి గురైన బాలుడి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ఘటనపై దర్యాప్తు చేపట్టారు.
చిన్నారిపై జరిగిన ఈ దాడికి సంబంధించిన వీడియో బయటకు రావడంతో ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. పాఠశాలల్లో చిన్నారుల భద్రత, ఉపాధ్యాయుల ప్రవర్తనపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
also read: వివాదాస్పద వీడియోల కేసు.. ఎమ్మెల్సీ మిర్జా రహ్మత్ బేగ్పై ఎంఐఎం వేటు
