ఉత్తరప్రదేశ్లోని హస్తినాపూర్లో ఓ ఉపాధ్యాయుడి తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తరగతి గదిలో చదువుకుంటున్న పదో తరగతి విద్యార్థిపై టీచర్ విచక్షణారహితంగా దాడి చేసిన ఘటన కలకలం రేపుతోంది. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
సమాచారం ప్రకారం.. క్లాస్రూమ్లో విద్యార్థి చదువుకుంటుండగా అక్కడికి వచ్చిన ఉపాధ్యాయుడు అతడిని చదువు గురించి ప్రశ్నించినట్లు తెలుస్తోంది. విద్యార్థి సమాధానం చెప్పేలోపే అతడిపై చేయి చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కేవలం 39 సెకన్ల వ్యవధిలో విద్యార్థి చెంపపై 17 సార్లు కొట్టినట్లు సీసీటీవీ దృశ్యాల్లో కనిపిస్తున్నట్లు సమాచారం.
అంతటితో ఆగకుండా విద్యార్థి ముఖం, తల, వీపుపై పిడికిలితో కూడా దాడి చేసినట్లు తెలుస్తోంది. ఊహించని పరిణామంతో విద్యార్థి తీవ్ర భయాందోళనకు గురైనట్లు సమాచారం. ఈ ఘటనపై విద్యార్థి తండ్రి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.
కాగా, తరగతి గదిలో జరిగిన ఈ ఘటన మొత్తం సీసీటీవీ కెమెరాలో రికార్డైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతోంది. విద్యార్థిపై ఇంతటి దాడికి పాల్పడిన ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.
also read: అంబటి రాంబాబుకు అస్వస్థత.. అపోలోలో స్టెంట్ అమర్చిన వైద్యులు
