తల్లి మరణించిన విషాదం నుంచి తేరుకోకముందే కుమారుడు కూడా మృతి చెందడంతో ఓ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. తల్లి అంత్యక్రియలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న సమయంలో కుమారుడు గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయిన ఘటన హనుమకొండ జిల్లా ఐనవోలు మండలంలో చోటుచేసుకుంది.
ఐనవోలు మండల కేంద్రానికి చెందిన కొండేటి మల్లికాంబ (68) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. పరిస్థితి విషమించడంతో ఆమెను వరంగల్లోని ఎంజీఎం ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందించారు. అయితే చికిత్స పొందుతూ గురువారం రాత్రి మల్లికాంబ మృతి చెందారు.
తల్లి మృతిచెందడంతో ఆమె కుమారుడు రవి (38) తీవ్ర విషాదానికి గురయ్యాడు. తల్లి మరణాన్ని జీర్ణించుకోలేక ఆందోళనకు గురైన ఆయన.. శుక్రవారం ఉదయం అంత్యక్రియలకు వెళ్లేందుకు సిద్ధమవుతుండగా ఒక్కసారిగా గుండెపోటుకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు వెంటనే స్పందించినప్పటికీ రవి ప్రాణాలు కోల్పోయాడు.
ఒకే కుటుంబంలో కొన్ని గంటల వ్యవధిలో తల్లి, కుమారుడు మృతి చెందడంతో విషాదం మరింత విషాదంగా మారింది. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. స్థానికంగా కూడా ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది.
also read: తిరుపతి మహిళ దారుణ హత్య.. ముఖంపై యాసిడ్ పోసి, 20 సవర్ల బంగారం అపహరణ
