దేశంలోని ఉత్తర, మధ్య, తూర్పు ప్రాంతాలు ప్రస్తుతం తీవ్ర వడగాడ్పులతో అల్లాడుతున్నాయి. ముఖ్యంగా మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, హరియాణా రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్ను దాటుతున్నాయి. ఈ తీవ్ర ఎండల ప్రభావం ప్రజల ఆరోగ్యంపై తీవ్రంగా పడుతోందని తాజా అధ్యయనం వెల్లడించింది.
5 రోజుల్లో 30 వేల మంది మృతి
ఫ్రంటియర్స్ ఇన్ ఎన్విరోన్మెంటల్ హెల్త్ జర్నల్లో ప్రచురితమైన పరిశోధన ప్రకారం, తీవ్రమైన వేడి కారణంగా దేశ వ్యాప్తంగా ఒక్క రోజులోనే సుమారు 3,400 మంది చనిపోయారు. ఐదు రోజుల వ్యవధిలో దేశమంతటా దాదాపు 30 వేల మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధ్యయనం అంచనా వేసింది. దేశంలోని 10 ప్రధాన నగరాల్లో ఎండల ప్రభావంతో జరిగిన మరణాలను పరిశోధకులు విశ్లేషించారు. సాధారణంగా ఒక నిర్దిష్ట కాలంలో సంభవించే మరణాల సంఖ్యతో పోల్చి, అదనంగా నమోదైన మరణాలను అదనపు మరణాలుగా పరిగణించారు. గత కొద్ది సంవల్సరాల డేటా ఆధారంగా ఈ లెక్కలను రూపొందించినట్లు తెలిపారు.
యూపీలో ఎక్కువ మరణాలు
ఈ పరిశోధనను ఇండియా ఎనర్జీ సంస్థకు చెందిన పీయూష్ నారంగ్, అలాగే అమెరికాలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం, బెర్కెలీ క్లైమేట్ సెంటర్కు చెందిన అశోక్ గాడ్గిల్ నిర్వహించారు. వారి వివరాల ప్రకారం, ఉత్తరప్రదేశ్ లోనే ఐదు రోజుల వ్యవధిలో వడగాడ్పుల కారణంగా సుమారు 8,100 అదనపు మరణాలు సంభవించాయి. అహ్మదాబాద్, జైపూర్, సూరత్ వంటి నగరాలు ఉన్న జిల్లాల్లో కూడా ఒక్కో జిల్లాలో 250కు పైగా అదనపు మరణాలు నమోదైనట్లు అధ్యయనం పేర్కొంది. దేశంలో అత్యధికంగా ప్రభావితమైన ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉందని పరిశోధకులు తెలిపారు.
ఈ ఐదు రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా నమోదైన అదనపు మరణాల్లో 66 శాతం చోటుచేసుకున్నాయి. అయితే దేశ జీడీపీలో ఈ రాష్ట్రాల వాటా కేవలం 29 శాతం మాత్రమే ఉండటం గమనార్హం. అలాగే దేశ జనాభాలో మూడో వంతు ఉన్న టాప్ 100 జిల్లాల్లోనే మొత్తం అదనపు మరణాల్లో 44 శాతం నమోదైనట్లు అధ్యయనం వెల్లడించింది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ప్రజారోగ్యానికి పెద్ద సవాలుగా మారుతున్నాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.