క్రైం మిర్రర్ : ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి వ్యవహారంపై మాజీ సీబీఐ డైరెక్టర్, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి నాగేశ్వరరావు స్పందించారు. ఈ కేసులో నిష్పాక్షికంగా దర్యాప్తు జరిపి ఉదయ్ కృష్ణారెడ్డికి న్యాయం చేయాలని ఆయన కోరారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ప్రేమ సంబంధం విఫలమవడం మాత్రమే క్రిమినల్ కేసుకు కారణం కాకూడదని ఆయన అభిప్రాయపడ్డారు. ఎఫ్ఐఆర్ నమోదైన వెంటనే ఉదయ్ కృష్ణారెడ్డిని సస్పెండ్ చేయడం పలు సందేహాలకు తావిస్తోందని పేర్కొన్నారు.
పరస్పర అంగీకారంతో సంబంధం కొనసాగినట్లు తేలితే, ఇద్దరిపైనా ఒకే విధమైన క్రమశిక్షణా చర్యలు ఉండాలని, ఒకరిపై మాత్రమే చర్యలు తీసుకోవడం సమంజసం కాదని వ్యాఖ్యానించారు. ఉదయ్ కృష్ణారెడ్డి సస్పెన్షన్ నిర్ణయాన్ని కేంద్ర హోంశాఖ పునఃసమీక్షించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దర్యాప్తు పూర్తయ్యే వరకు ఆయనకు శిక్షణ కొనసాగించే అవకాశం కల్పించాలని సూచించారు. అలాగే హైదరాబాద్ పోలీస్ కమిషనర్, తెలంగాణ డీజీపీ నిష్పాక్షిక విచారణ జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ అంశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ కూడా దృష్టి సారించాలని నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. కానిస్టేబుల్గా సేవలు ప్రారంభించి ఐపీఎస్ స్థాయికి చేరుకున్న ఉదయ్ కృష్ణారెడ్డి ప్రయాణం అనేక మంది యువతకు స్ఫూర్తిదాయకమని ఆయన తన పోస్టులో పేర్కొన్నారు.
also read : షూటింగ్లో బాలకృష్ణకు గాయం.. అభిమానుల్లో ఆందోళన