క్రైమ్ మిర్రర్ : హోర్ముజ్ జలసంధిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆ ప్రాంతంపై అమెరికాకు పూర్తి నియంత్రణ ఉందని ఆయన పేర్కొన్నారు. ఇరాన్ నుంచి ఎలాంటి రెచ్చగొట్టే చర్యలు ఎదురైనా తీవ్రంగా స్పందిస్తామని హెచ్చరించారు. ఇరాన్పై తనకు నమ్మకం లేదని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఆ దేశం తరచూ తమతో నిజాయితీగా వ్యవహరించడం లేదని ఆరోపించారు. హోర్ముజ్ జలసంధిపై ఇరాన్కు ప్రస్తుతం నియంత్రణ లేదని, అమెరికా బలగాలు అక్కడ బలమైన స్థితిలో ఉన్నాయని ఆయన అన్నారు.
పశ్చిమాసియాలో అమెరికా పరిస్థితి ప్రస్తుతం బలంగా ఉందని ట్రంప్ పేర్కొన్నారు. ఈ ప్రాంతంలోని ఇతర దేశాలను సుదీర్ఘకాలంగా బెదిరిస్తూ వస్తున్న శక్తులకు ఇకపై ఆ పరిస్థితి కొనసాగదని వ్యాఖ్యానించారు. మరోవైపు, అమెరికా తమపై అన్యాయంగా ఆంక్షలు విధిస్తోందని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి విమర్శించినట్లు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. హోర్ముజ్ జలసంధిలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులకు అమెరికా, ఇజ్రాయెల్ చర్యలే కారణమని ఇరాన్ ఆరోపించింది. ఇదిలా ఉండగా, హోర్ముజ్ జలసంధిలో నౌకల రాకపోకలు సురక్షితంగా కొనసాగించే అంశంపై ఇరాన్, ఒమాన్ మధ్య చర్చలు జరుగుతున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.
also read : భార్యపై అనుమానం.. ఇటుకతో దాడి చేసి హత్య చేసిన భర్త
