క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: జాంబియాలో జరిగిన అంతర్జాతీయ మైన్స్ రెస్క్యూ పోటీలలో (IMRC 2026) సింగరేణి (SCCL) రెస్క్యూ టీమ్ భూగర్భ గనుల రెస్క్యూ (Underground Mines Rescue) విభాగంలో మొదటి బహుమతిని సాధించి చరిత్ర సృష్టించింది.
ఈ అంతర్జాతీయ పోటీలు ఏప్రిల్ 30 నుండి మే 5, 2026 వరకు జాంబియాలోని వెస్ట్ పోర్టల్ మైన్ మరియు మొపాని సెంట్రల్ ట్రైనింగ్ సెంటర్లో జరిగాయి. సుమారు 700 మీటర్ల లోతులో చిక్కుకున్న ఇద్దరు వ్యక్తులను రక్షించే టాస్క్ను సింగరేణి జట్టు కేవలం 52 నిమిషాల్లోనే పూర్తి చేసింది. నిజానికి దీనికి కేటాయించిన సమయం 2 గంటలు. టీమ్ సభ్యుడు సి.హెచ్. సాయి కృష్ణ 90 నిమిషాల టెక్నికల్ టెస్టును కేవలం 52 నిమిషాల్లోనే పూర్తి చేసి తన వేగాన్ని, నైపుణ్యాన్ని చాటుకున్నారు.
భారత్తో పాటు చైనా, కెనడా, ఆస్ట్రేలియా, పోలాండ్, కొలంబియా మరియు జాంబియా వంటి దేశాల నుండి అత్యుత్తమ రెస్క్యూ టీమ్లు ఈ పోటీలో పాల్గొన్నాయి. ఈ బృందానికి రామగుండం మైన్స్ రెస్క్యూ స్టేషన్ జనరల్ మేనేజర్ శ్రీనివాసరెడ్డి పర్యవేక్షణలో శిక్షణ లభించింది. సింగరేణికి చెందిన డాక్టర్ రాజేశ్వర్ ఈ పోటీలకు ‘ఫస్ట్ ఎయిడ్’ విభాగంలో అంతర్జాతీయ న్యాయ నిర్ణేతగా (Judge) వ్యవహరించారు.
ఈ గౌరవం పొందిన మొదటి భారతీయుడు ఆయనే. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత సింగరేణి అంతర్జాతీయ వేదికపై ఇటువంటి ఘనతను సాధించడం విశేషం. ఈ సందర్భంగా సింగరేణి సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి జట్టు సభ్యులను అభినందించారు.