క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: హైదరాబాద్ మెట్రో వేళలు మరియు MMTS ఉచిత ప్రయాణంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం ఉదయం 6 గంటలకు ప్రారంభమవుతున్న మెట్రో రైలు సర్వీసులను, ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఉదయం 5 గంటలకే ప్రారంభించాలని అధికారులు యోచిస్తున్నారు.
ఉదయం 5 నుండి 6 గంటల మధ్య సికింద్రాబాద్, నాంపల్లి వంటి ప్రధాన స్టేషన్లకు చేరుకునే సుమారు 50 వేల మంది రైల్వే ప్రయాణికులకు రవాణా సౌకర్యం కల్పించడం ఈ ప్రతిపాదన ముఖ్య ఉద్దేశ్యం. దక్షిణ మధ్య రైల్వే జీఎం విజ్ఞప్తి మేరకు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు మెట్రో రైలు అధికారులతో (HMRL) ఈ అంశంపై చర్చించి, సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని సూచించారు.
MMTSలో ఉచిత ప్రయాణం…
కేవలం మహిళలకే కాకుండా, పురుషులు, మహిళలు అనే తేడా లేకుండా అందరికీ MMTS రైళ్లలో ఉచిత ప్రయాణం కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2, 2026 నుండి ఈ పథకాన్ని ఏడాది పాటు ప్రయోగాత్మకంగా అమలు చేసే అవకాశం ఉంది.
ఉచిత ప్రయాణం వల్ల రైల్వేకు కలిగే సుమారు రూ. 10 కోట్ల వార్షిక ఆదాయ లోటును రాష్ట్ర ప్రభుత్వమే భరించనుంది. MMTS స్టేషన్ల వరకు వెళ్లడానికి ఆర్టీసీ ద్వారా షటిల్ బస్సులను కూడా అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది.