క్రైం మిర్రర్ : తెలంగాణ డీజీపీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఓ కానిస్టేబుల్ మృతి చెందడం పోలీసు వర్గాల్లో తీవ్ర విషాదాన్ని కలిగించింది. స్వామి అనే కానిస్టేబుల్ బుధవారం రాత్రి తన నైట్ డ్యూటీకి హాజరయ్యారు. గురువారం తెల్లవారుజామున కార్యాలయ ఆవరణలో ఆయన అపస్మారక స్థితిలో కనిపించగా, వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీమ్ ఆధారాలను సేకరించగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమిక విచారణలో కుటుంబంలో నెలకొన్న మనస్పర్థలు ఈ ఘటనకు ఒక కారణంగా ఉండి ఉండవచ్చనే కోణంలో కూడా విచారణ కొనసాగుతోంది. అయితే పూర్తి వివరాలు దర్యాప్తు అనంతరం మాత్రమే వెల్లడయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
దర్యాప్తులో భాగంగా స్వామికి చెందిన వ్యక్తిగత వస్తువులను పరిశీలించగా, ఆయన రాసినట్లు భావిస్తున్న ఒక డైరీ లభ్యమైనట్లు సమాచారం. అందులో తన కుటుంబ సభ్యులను ఎలాంటి ఇబ్బందులకు గురి చేయవద్దని, వారిని జాగ్రత్తగా చూసుకోవాలని కోరుతూ భావోద్వేగంగా రాసిన సందేశాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ నోట్ను కూడా విచారణలో భాగంగా పరిశీలిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా, ఈ ఘటనకు సంబంధించిన అన్ని కోణాల్లో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.
also read : జైలులో పెళ్లి.. యావజ్జీవ ఖైదీల ప్రేమకు చట్టబద్ధ ముద్ర