క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: ముఖ్యమంత్రి కాన్వాయ్ వెళ్లే సమయంలో సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ను పూర్తిగా నిలిపివేయవద్దని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర డీజీపీ సి.వి. ఆనంద్ను ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు, గురువారం (మే 7, 2026) రేవంత్ రెడ్డి ఢిల్లీ నుంచి తిరిగి వచ్చినప్పుడు శంషాబాద్ విమానాశ్రయం నుండి తన నివాసం వరకు సాధారణ ట్రాఫిక్లోనే ప్రయాణించారు.
కాన్వాయ్ వెళ్లే సమయంలో ట్రాఫిక్ను పూర్తిగా నిలిపివేయకుండా, సింగిల్ లైన్లో సాధారణ వాహనాలను అనుమతించాలని పోలీసులకు స్పష్టం చేశారు. కాన్వాయ్ వెళ్లే మార్గానికి అవతలి వైపు (opposite direction) వచ్చే వాహనాలను ఎట్టిపరిస్థితుల్లోనూ నిలపవద్దని సీఎం ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ట్రాఫిక్ నిర్వహణను పటిష్టం చేసేందుకు అదనపు డీజీపీ నేతృత్వంలో ఒక ప్రత్యేక ట్రాఫిక్ బ్యూరోను త్వరలోనే ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
ట్రాఫిక్ నియంత్రణలో నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రజలను గంటల తరబడి రోడ్లపై నిలిపివేసే అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని సీఎం హెచ్చరించారు. రద్దీ సమయాల్లో ప్రత్యామ్నాయ మార్గాలను సిద్ధం చేసుకోవాలని, వర్షాకాలంలో నీరు నిలిచే ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని డీజీపీ పోలీసు అధికారులను ఆదేశించారు.