క్రైమ్ మిర్రర్,జాతీయం :- తెలుగు రాష్ట్రాల్లో ఎండలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ఏపీ, తెలంగాణలో పగటి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరుతున్నాయి. ఇలాంటి వేళ బయట పని ముగించుకుని ఇంటికి రాగానే చాలామంది ఫ్రిజ్లోని చల్లటి నీళ్లు గటగటా తాగేస్తుంటారు. ఆ క్షణంలో చల్లగా అనిపించినా.. అది కొన్నిసార్లు శరీరానికి అసౌకర్యం కలిగించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
ఎండలో ఎక్కువసేపు తిరిగినప్పుడు శరీరం వేడిని తగ్గించేందుకు చాలా కష్టపడుతుంది. చెమట ఎక్కువగా పడుతుంది. రక్తప్రసరణ వేగంగా జరుగుతుంది. దీంతో శరీరంలోని నీటి శాతం తగ్గి అలసట, డీహైడ్రేషన్ సమస్యలు వస్తాయి.
అలాంటి సమయంలో ఒక్కసారిగా బాగా చల్లటి నీళ్లు తాగితే రక్తనాళాలు తాత్కాలికంగా ముడుచుకునే అవకాశం ఉంటుంది. దీంతో కొందరికి తలనొప్పి, తల తిరిగినట్టు అనిపించవచ్చు. మైగ్రేన్ లేదా సైనస్ సమస్య ఉన్నవారికి ఇబ్బంది మరింత పెరిగే అవకాశం ఉంది.మరికొందరిలో కడుపులో కండరాలు పట్టేసినట్టు అనిపించవచ్చు. జీర్ణక్రియ కొద్దిసేపు మందగించే అవకాశం కూడా ఉంటుంది. అలాగే గొంతులో అసౌకర్యం, గొంతు నొప్పి లేదా తెమడ ఎక్కువగా రావడం కూడా కనిపించొచ్చు.ఎండ నుంచి వచ్చి వెంటనే చల్లటి నీళ్లు తాగినప్పుడు అకస్మాత్తుగా తలనొప్పి రావడాన్ని “బ్రెయిన్ ఫ్రీజ్” అని అంటారు. కొందరికి ఇది కొన్ని నిమిషాల పాటు అసౌకర్యంగా ఉంటుంది.
శరీరం ఇప్పటికే వేడి వల్ల ఒత్తిడిలో ఉన్న సమయంలో చల్లటి నీరు తాగడం వల్ల ఒక్కసారిగా షాక్ లాంటి ఫీలింగ్ రావొచ్చు. ఉష్ణోగ్రత మార్పులకు త్వరగా ప్రభావితమయ్యే వాళ్లలో గుండె వేగంపైనా తాత్కాలిక ప్రభావం పడే అవకాశం ఉందని వైద్యులు సూచిస్తున్నారు.అందుకే ఎండలో నుంచి వచ్చిన వెంటనే ఐస్ వాటర్ తాగే బదులు.. కాసేపు విశ్రాంతి తీసుకుని సాధారణ ఉష్ణోగ్రతలో ఉన్న నీళ్లు లేదా గోరువెచ్చని నీళ్లు తాగడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇలా చేస్తే శరీరానికి హాయిగా ఉండటంతో పాటు ఆరోగ్య సమస్యలు కూడా దూరంగా ఉంటాయి.