చిన్న వివాదం ఎంత పెద్ద సమస్యగా మారుతుందో చెప్పే ఘటన బిహార్లో వెలుగులోకి వచ్చింది. కేవలం రూ.150 అప్పు విషయంలో మొదలైన గొడవ ఏకంగా 45 ఏళ్ల పాటు కోర్టుల చుట్టూ తిప్పింది.
బిహార్కు చెందిన రామచంద్ర రాయ్.. 1981లో తన పొరుగువ్యక్తి శ్యామ్ నారాయణ్ రాయ్కు రూ.150 అప్పుగా ఇచ్చారు. కొంతకాలం తర్వాత ఆ డబ్బు తిరిగి ఇవ్వాలని అడగడంతో ఇద్దరి మధ్య వివాదం మొదలైంది. ఆ వివాదం క్రమంగా పోలీస్ స్టేషన్కు, ఆ తర్వాత కోర్టుకు చేరింది.
అప్పట్లో రూ.150 కోసం మొదలైన ఈ న్యాయపోరాటం.. నాలుగు దశాబ్దాలకు పైగా కొనసాగింది. కేసు కోసం లాయర్ల ఫీజులు, ప్రయాణ ఖర్చులు, ఇతర న్యాయపరమైన వ్యయాల రూపంలో ఇరువర్గాలు కలిపి సుమారు రూ.5 నుంచి రూ.6 లక్షల వరకు ఖర్చు చేసినట్లు సమాచారం.
ఈ కేసులో వాయిదాల సంఖ్య కూడా ఆశ్చర్యపరుస్తోంది. 2018 నుంచి 2026 మధ్య కాలంలోనే దాదాపు 130 సార్లు విచారణ వాయిదా పడగా, మొత్తం 45 ఏళ్లలో సుమారు 700 సార్లు కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది. చిన్న మొత్తానికి మొదలైన వివాదం ఇంత సుదీర్ఘ న్యాయపోరాటంగా మారడం.. దేశంలోని న్యాయస్థానాల్లో కేసుల పెండింగ్, విచారణ ఆలస్యంపై మరోసారి చర్చకు దారితీసింది.
also read: పిల్లలు పుట్టలేదని అత్తింటి వేధింపులు..? అనుమానాస్పదంగా వివాహిత మృతి!