•తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం
•తక్షణ ఏర్పాట్లకు రూ.300 కోట్లు
•పర్యవేక్షణకు మంత్రులతో నాలుగు కమిటీలు
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో:-గోదావరి పుష్కరాలు అంటే ముందుగా గుర్తొచ్చేది ఏపీ.. రాజమండ్రి తో పాటు ఉభయ గోదావరి జిల్లాలో మాత్రమే గోదావరి పుష్కరాలు జరుగుతాయని అంతా భావిస్తారు. కానీ తెలంగాణలో సైతం గోదావరి పుష్కరాలు నిర్వహించేందుకు అక్కడి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటుచేస్తోంది. గోదావరి ఒక్క ఏపీలోనే కాదు తెలంగాణలో సైతం ప్రవహిస్తూ వస్తుంది. అందుకే తెలంగాణలో సైతం గోదావరి పుష్కరాలను ఘనంగా జరిపేందుకు అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకుగాను రూ.1000 కోట్లను కేటాయిస్తూ మంత్రివర్గ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు. దీనికి మంత్రులు ఆమోదం తెలిపారు. తక్షణం ఏర్పాట్లు ప్రారంభించాలని కూడా సీఎం స్పష్టం చేశారు. రూ.300 కోట్లు విడుదల చేయాలని కూడా నిర్ణయించారు.
వచ్చే ఏడాది జూన్ లో..
వచ్చే ఏడాది జూన్ లో గోదావరి పుష్కరాలు జరగనున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వంలో తొలి పుష్కరాలు ఇవే. అందుకే తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అనుగుణంగా అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. పుష్కరాల ఏర్పాట్లను పరిశీలించేందుకు, నిర్వహణను సమన్వయం చేసుకునేందుకు మంత్రులతో కూడిన నాలుగు కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీనిపై కసరత్తు చేసే బాధ్యతను మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు అప్పగించారు. పుష్కరాలకు ప్రత్యేక బస్సులు పెట్టడంతో పాటు భక్తులకు నది తీరం వెంబడి సౌకర్యాలను ఏర్పాటు చేయడం వంటివి కీలకంగా ఉండాలని సీఎం రేవంత్ ఆదేశించారు.
మూడు రాష్ట్రాల్లో పుష్కరాలు..
గోదావరి పుష్కరాలు అనేవి కేవలం ఏపీలో మాత్రమే కాదు. తెలంగాణతో పాటు మహారాష్ట్రలో నిర్వహిస్తున్నారు. మూడు రాష్ట్రాలు పోటా పోటీగా ఏర్పాట్లు చేస్తున్నాయి. గోదావరి పుష్కరాలను ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఏర్పాట్లు చేసింది. గతం కంటే పుష్కర ఘాట్ల సంఖ్య పెరిగింది. దేశం నలుమూలల నుంచి భక్తులు వచ్చేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాజమండ్రి రైల్వే స్టేషన్ అభివృద్ధి కూడా జరుగుతోంది. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల నుంచి వందలాది రైలు సర్వీసులు నడిచేలా ఏర్పాటులు జరుగుతున్నాయి. ఈ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ముందుకు అడుగులు వేస్తున్నాయి.