Strange Dispute in Bengaluru: బెంగళూరులో విచిత్ర ఘటన జరిగింది. శేషాద్రిపురం జయభీమనగర్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటన అందరినీ నవ్వుల్లో ముంచెత్తింది. చివరికి ఈ కేసు పోలీసులు దగ్గరికి వెళ్లడంతో వాళ్లు ఆసక్తికర పరిష్కారం చూపించారు.
ఇంతకీ అలసలు ఏం జరిగిందంటే?
జయభీమనగర్ లో పక్కపక్కనే ఉండే ఇద్దరు వ్యక్తులు తమ తమ ఇళ్లలో పిల్లులను పెంచుకుంటున్నారు. ఒకరి దగ్గర ఆడ పిల్లి ఉండగా, మరొకరి దగ్గర మగ పిల్లి ఉంది. ఆదివారం రోజున ఆడ పిల్లి నాలుగు పిల్లలను ఈనింది. కానీ, ఆ పిల్లి పిల్లల వల్ల వచ్చిన గందరగోళం వల్ల ఆ ఇంటి యజమాని అసహనానికి గురయ్యాడు. దీనికి కారణం పక్కింటి మగ పిల్లే అని భావించి, కోపంతో వారి ఇంటికి వెళ్లి గొడవ పెట్టుకున్నాడు. “మా పిల్లి ఈ పిల్లలను కనడానికి మీ పిల్లే కారణం, కాబట్టి వీటిని చూసుకునే బాధ్యత మీది” అని చెప్పి, ఆ నాలుగు పిల్లి పిల్లలను తీసుకెళ్లి వారి ఇంట్లో వదిలేశాడు.
పోలీసులు దగ్గరికి చేరిన పంచాయితీ
ఈ విషయం చిన్నగా మొదలై, తర్వాత పెద్ద గొడవగా మారింది. ఇరు కుటుంబాల మధ్య వాగ్వాదం తీవ్రరూపం దాల్చడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. చివరకు ఈ విషయం పోలీసుల వరకు చేరింది. పోలీసులు అక్కడికి చేరుకుని ఇరు కుటుంబాలను శాంతింపజేశారు. సమస్యను సులభంగా పరిష్కరించేందుకు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నాలుగు పిల్లి పిల్లలను ఇద్దరికీ సమానంగా పంచి, రెండేసి చొప్పున పెంచుకోవాలని సూచించారు. దీంతో చివరకు ఇరు కుటుంబాలు కూడా అంగీకరించడంతో గొడవ ముగిసింది. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. చిన్న విషయాలు కూడా ఎలా పెద్ద సమస్యలకు దారితీస్తాయో ఈ సంఘటన ద్వారా తెలుస్తోంది.
