కర్ణాటకలో ఓ విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. 65 ఏళ్ల వృద్ధురాలు ఒక కేసులో తనకు అనుకూలంగా తీర్పు వచ్చేందుకు ఎవరూ ఊహించని చర్యకు పాల్పడింది. ఆమె పేరు మంజుల. ఊరు చిక్కబళ్లాపూర్. కోర్టులోని మహిళా న్యాయమూర్తి సీటుపై చేతబడి చేయడానికి ప్రయత్నించింది.
మంజులకు సంబంధించిన కేసు ‘ఫస్ట్ అడిషినల్ సీనియర్ సివిల్ జడ్జ్ అండ్ కోర్ట్ ఆఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్’ కోర్టులో నడుస్తోంది. తీర్పు తనకు మంచిగా రావాలనే ఆశతో మంజుల ఈ పని చేసింది. కొద్ది రోజుల క్రితం కోర్టు హాలులోకి వెళ్లి, న్యాయమూర్తి కూర్చునే సీటు మీద తెల్ల ఆవాలు చల్లి చేతబడి చేసినట్టు చేసింది. కానీ, ఆమె ఇంత ధైర్యంగా కోర్టు లోపలే ఇలా చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
అయితే, ఈ కేసులో ముంజుల అనుకున్నట్టు అన్నీ సాఫీగా జరగలేదు. కోర్టు ప్రాంగణంలో ఉన్న సీసీటీవీ కెమెరాలు ఆమె చేసిన పనిని రికార్డ్ చేశాయి. ఆ దృశ్యాలు చూసి కోర్టు అధికారులు షాక్ అయ్యారు. వెంటనే కోర్ట్ చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
విచారణలో మంజులను అదుపులోకి తీసుకున్నారు. ఆమెను విచారించగా, తీర్పు తనకు కావాలనే ఉద్దేశంతోనే ఇలా చేసినట్టు ఒప్పుకుంది. పోలీసులు ఆమెను కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆమెకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ప్రస్తుతం ఆమె జైలులో ఉంది. “రెండు రోజుల క్రితం నిందితురాలు న్యాయమూర్తి సీటుపై తెల్ల ఆవాలు చల్లుతున్న దృశ్యాలు సీసీటీవీలో స్పష్టంగా కనిపించాయి. దీని ఆధారంగా చర్యలు తీసుకున్నాం” అని తెలిపారు.
ఈ సంఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. కోర్టు లోపల ఇలాంటి మూఢనమ్మకాలు, చేతబడులు జరగడం అసాధారణం. న్యాయవ్యవస్థపై నమ్మకం ఉంచాల్సిన సమయంలో ఇలాంటి ఘటనలు జరగడం బాధాకరం. పోలీసులు మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు. ఈ కేసు ఇంకా కొనసాగుతోంది.