భారత యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీకి బీసీసీఐ ప్రత్యేక అవకాశం కల్పించింది. ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనల కోసం భారత టీ20 జట్టులో చోటు దక్కించుకున్న ఈ యువ ఆటగాడితో పాటు అతడి తల్లిదండ్రులు కూడా వెళ్లేలా ఏర్పాట్లు చేసింది. ప్రస్తుతం వైభవ్ వయసు కేవలం 15 సంవత్సరాలు మాత్రమే. జట్టులోని ఇతర ఆటగాళ్లతో పోలిస్తే అతడు చాలా చిన్నవాడు కావడంతో కొత్త వాతావరణానికి అలవాటు పడేందుకు కొంత సమయం పట్టే అవకాశం ఉందని బోర్డు భావిస్తోంది. విదేశీ పర్యటనలో కుటుంబ సభ్యులు వెంట ఉంటే అతడికి మానసికంగా మరింత ధైర్యం లభిస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
వైభవ్ తో పాటు తల్లిదండ్రులు కూడా..
ఈ నేపథ్యంలో వైభవ్ తల్లిదండ్రులు కూడా అతడితో పాటు వెళ్లేందుకు బీసీసీఐ అనుమతి ఇచ్చింది. ఈ విషయాన్ని బోర్డు కార్యదర్శి దేవజిత్ సైకియా వెల్లడించారు. ఇప్పటికే వైభవ్ కుటుంబ సభ్యులకు దీనిపై సమాచారం అందించినట్లు తెలిసింది. అంతేకాకుండా, తల్లిదండ్రుల ప్రయాణం, వసతి తదితర ఖర్చులను కూడా బీసీసీఐనే భరించనుంది. యువ ఆటగాడు విదేశీ పర్యటనలో ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా, పూర్తిగా ఆటపై దృష్టి పెట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
సచిన్ తర్వాత వైభవ్..
ఇలాంటి ఉదాహరణ గతంలో కూడా ఉంది. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తన 16 ఏళ్ల వయసులో పాకిస్థాన్ పర్యటనకు ఎంపికైనప్పుడు, అతడికి అండగా ఉండేందుకు అన్నయ్య అజిత్ టెండూల్కర్ను బోర్డు పంపించింది. ఇప్పుడు వైభవ్ విషయంలో కూడా అదే తరహా నిర్ణయం తీసుకోవడం ఆసక్తికరంగా మారింది.
ఐపీఎల్ లో సత్తా చాటిన వైభవ్
ఇటీవల దేశీయ క్రికెట్తో పాటు ఐపీఎల్లోనూ తన ప్రతిభతో ఆకట్టుకున్న వైభవ్ సూర్యవంశీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ పర్యటన అతడి కెరీర్లో కీలక మైలురాయిగా మారే అవకాశం ఉందని క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి. యువ ఆటగాడికి అనుకూల వాతావరణం కల్పించేందుకు బీసీసీఐ తీసుకున్న నిర్ణయంపై పలువురు ప్రశంసలు వ్యక్తం చేస్తున్నారు.