-
వారంలో ఒకరోజు పార్టీకి కేటాయింపు
-
చంద్రబాబు కీలక నిర్ణయం
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: తెలంగాణపై తెలుగుదేశం ఫోకస్ పెట్టిందా? ఆ రాష్ట్రంలో పార్టీని అభివృద్ధి చేయనుందా? ఈ విషయంలో పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ దృష్టి పెట్టారా? వారంలో ఒకరోజు సమయాన్ని తెలంగాణ టిడిపికి కేటాయించనున్నారా? పొలిటికల్ సర్కిల్స్ లో దీని పైనే ప్రచారం నడుస్తోంది.
గత కొంతకాలంగా తెలంగాణలో పార్టీ కార్యకలాపాలు నిలిచిపోయాయి. దీంతో పార్టీ శ్రేణుల్లో ఒక రకమైన ఆవేదన కనిపిస్తోంది. అక్కడ నాయకులు లేకపోయినా తెలుగుదేశం పార్టీకి క్యాడర్ ఉంది. ఆ కేడర్ను మరింత బలోపేతం చేసేందుకు ఇప్పుడు చంద్రబాబు ఆ బాధ్యతను లోకేష్ కు అప్పగించినట్లు తెలుస్తోంది.
-
నేతల ఆసక్తి..
కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత చంద్రబాబు తెలంగాణ టిడిపి పై దృష్టి పెట్టారు. అవకాశం ఉన్నప్పుడు చాలామంది నేతలు చంద్రబాబును కలుస్తూ వెళ్లారు. ఒకప్పుడు టిడిపిలో పనిచేసిన చాలామంది ఎమ్మెల్యేలు, భారత రాష్ట్ర సమితిలో అసంతృప్తిగా ఉన్న నేతలు చంద్రబాబును కలుస్తూ వచ్చారు..
తీగల కృష్ణారెడ్డి, అరికెపూడి గాంధీ మాధవరం కృష్ణారావు వంటి నేతలు పార్టీలో పని చేసేందుకు సిద్ధపడ్డారు. మాజీ మంత్రి బాబు మోహన్ అయితే చంద్రబాబును కలిసి పార్టీలో చేరుతానని కూడా సంసిద్ధత వ్యక్తం చేశారు. కానీ ఎందుకో చంద్రబాబు పెద్దగా మొగ్గు చూపలేదు. పార్టీని బలోపేతం చేసే బాధ్యతను వాయిదా వేశారు.
పార్టీ రాష్ట్ర కార్యవర్గాలను ప్రకటించలేదు. ఒకరిద్దరు తెలంగాణ నేతలను పోలిక్ బ్యూరోలోకి తీసుకున్నారు. అయితే ఇప్పుడు మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో చంద్రబాబు తెలంగాణలో పార్టీని బలోపేతంపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఆ బాధ్యతను పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు అప్పగించినట్లు సమాచారం.
-
సీట్లు పెంచుకోవాలని..
ప్రస్తుతం ఏపీ మంత్రిగా ఉన్నారు నారా లోకేష్. ప్రభుత్వంతో పాటు పార్టీలోనూ క్రియాశీలక పాత్ర పోషిస్తూ వస్తున్నారు. క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ఈ సమయంలో వారానికి ఒకరోజు తెలంగాణలో పార్టీ కోసం సమయాన్ని కేటాయిస్తారని తెలుస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలతో పాటు సార్వత్రిక ఎన్నికల్లో పొత్తు దిశగా తెలంగాణలో మిగతా రాజకీయ పార్టీలు ప్రయాణిస్తున్నాయి.
ఈ క్రమంలో పార్టీని బలోపేతం చేసి పొత్తులో భాగంగా సీట్లతో పాటు ఓట్లు పెంచుకోవాలని చూస్తున్నారు చంద్రబాబు. అందుకే తెలంగాణలో పార్టీని క్రియాశీలకం చేసి.. క్యాడర్ను మరింత బలోపేతం చేస్తే ఫలితం ఉంటుంది అని ఆలోచన చేస్తున్నారు. లోకేష్ ను యాక్టివ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే లోకేష్ ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి.