వసంత కాలం ప్రారంభమయ్యే సమయంలో ప్రకృతి తన అసలైన అందాన్ని ప్రదర్శిస్తుంది. మంచు కరిగిపోతూ పచ్చని లోయలు, రంగురంగుల పూలతో కొండ ప్రాంతాలు అద్భుతంగా మారిపోతాయి. ఈ సీజన్ ట్రెక్కింగ్ ప్రియులకు స్వర్గంలాంటిదిగా భావిస్తారు. భారతదేశంలోని హిమాలయ ప్రాంతాల్లో వసంత కాలంలో చేసే ట్రెక్కింగ్ యాత్రలు జీవితాంతం గుర్తుండిపోయే అనుభూతిని అందిస్తాయి. అడ్వెంచర్ ప్రేమికులు తప్పక అనుభవించాల్సిన 7 అద్భుతమైన స్ప్రింగ్ ట్రెక్స్ ఇవే.
చోప్తా చంద్రశిల ట్రెక్
“భారతదేశపు స్విట్జర్లాండ్”గా ప్రసిద్ధి చెందిన ఈ ట్రెక్ వసంత కాలంలో మరింత అందంగా మారుతుంది. పచ్చిక బయళ్ళు, ఎరుపు రంగు రోడోడెండ్రాన్ పువ్వులు ట్రెక్కర్లను ఆకట్టుకుంటాయి. ఈ మార్గంలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శివాలయంగా పేరుగాంచిన తుంగనాథ్ దేవాలయంను దర్శించుకునే అవకాశం లభిస్తుంది. హిమాలయ శ్రేణుల అద్భుత దృశ్యాలు ఈ ట్రెక్ ప్రత్యేక ఆకర్షణ.
దయారా బుగ్యాల్ ట్రెక్
ఉత్తరాఖండ్లోని అందమైన పచ్చికభూములలో ఇది ఒకటి. శీతాకాలంలో మంచుతో కప్పబడే ఈ ప్రాంతం వసంతంలో పచ్చని కార్పెట్లా కనిపిస్తుంది. ట్రెక్కింగ్ను కొత్తగా ప్రారంభించే వారికి, కుటుంబంతో కలిసి ప్రయాణించే వారికి ఇది అత్యంత అనువైన ట్రెక్గా భావిస్తారు.
కువారీ పాస్ ట్రెక్
ఈ ట్రెక్ ద్వారా నందాదేవి శిఖరం, ద్రోణగిరి, కామేట్ వంటి హిమాలయ పర్వతాల అద్భుత దృశ్యాలు కనిపిస్తాయి. దీనిని “లార్డ్ కర్జన్ ట్రెక్” అని కూడా పిలుస్తారు. దట్టమైన అడవులు, మంచు కొండల మధ్య సాగిపోయే ఈ ప్రయాణం అడ్వెంచర్ ప్రేమికులకు ప్రత్యేక అనుభూతిని అందిస్తుంది.
హర్ కీ దూన్ ట్రెక్
పురాణాల్లో స్వర్గానికి వెళ్లే మార్గంగా చెప్పబడే ఈ లోయ వసంతంలో నందనవనంలా మారిపోతుంది. ఇక్కడి సంప్రదాయ గ్రామాలు, పర్వతాల మధ్య ప్రవహించే నదులు, అడవులు ట్రెక్కర్లను ఎంతగానో ఆకట్టుకుంటాయి. హిమాలయ ప్రాంతీయ సంస్కృతిని దగ్గరగా చూడాలనుకునే వారికి ఇది అద్భుతమైన ఎంపిక.
బ్రహ్మతాల్ ట్రెక్
సాధారణంగా దీనిని శీతాకాలపు ట్రెక్గా భావించినప్పటికీ వసంతంలో కూడా దీని అందం మరింత ప్రత్యేకంగా ఉంటుంది. కొండల మధ్య ఉన్న బ్రహ్మతాల్ సరస్సు, చుట్టూ వికసించే రోడోడెండ్రాన్ పూలు ఈ ప్రాంతాన్ని అద్భుతంగా మార్చేస్తాయి.
గోయిచా లా ట్రెక్
ఈశాన్య భారతదేశంలో అత్యంత ప్రసిద్ధ ట్రెక్కింగ్ మార్గాలలో ఇది ఒకటి. ప్రపంచంలో మూడవ అత్యంత ఎత్తైన శిఖరమైన కంచన్జంగా పర్వతంను చాలా దగ్గరగా వీక్షించే అవకాశం ఈ ట్రెక్ ద్వారా లభిస్తుంది. ఏప్రిల్, మే నెలల్లో వికసించే రంగురంగుల పూలు ఈ మార్గాన్ని కలల ప్రపంచంలా మార్చేస్తాయి. అయితే ఇది కొంత కఠినమైన ట్రెక్గా పరిగణిస్తారు.
బార్సే రోడోడెండ్రాన్ ట్రెక్
పువ్వులు, ప్రకృతి అందాలను ఇష్టపడే వారికి ఈ ట్రెక్ మరచిపోలేని అనుభూతిని ఇస్తుంది. వసంత కాలంలో బార్సే రోడోడెండ్రాన్ అభయారణ్యం మొత్తం ఎరుపు, గులాబీ రంగు పువ్వులతో కళకళలాడుతుంది. వికసించిన పూల మధ్య నడవడం ప్రకృతి ప్రేమికులకు ప్రత్యేక అనుభూతిని అందిస్తుంది.
వసంత కాలంలో మార్చి నుంచి మే వరకు ఈ ట్రెక్కింగ్ ప్రాంతాలకు వెళ్లాలని భావించే వారు ముందుగానే గైడ్లను బుక్ చేసుకోవడం, అవసరమైన ట్రెక్కింగ్ సామగ్రి సిద్ధం చేసుకోవడం మంచిది. సరైన ప్రణాళికతో ప్రయాణిస్తే ఈ యాత్రలు జీవితాంతం గుర్తుండే అనుభూతిని అందిస్తాయి.
ALSO READ: పింపుల్స్ ఉన్నవారు ఎండాకాలంలో చికెన్ తినడం మానేయాలా?