అనంతపురం జిల్లాలో నకిలీ అధికారుల మోసం కలకలం రేపింది. బెలుగుప్ప మండలం కేంద్రంగా ఐదుగురు మహిళల బృందం ఫుడ్ సేఫ్టీ అధికారులమంటూ దుకాణదారులను మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. మెడలో ఐడీ కార్డులు ధరించి అచ్చం అధికారుల మాదిరిగా ప్రవర్తించిన ఈ మహిళలు పలు షాపులు, బేకరీలలో తనిఖీలు నిర్వహిస్తూ హడావిడి చేశారు.
“ఇది సరిగా లేదు”, “ఆహార పదార్థాల నాణ్యత బాగోలేదు”, “నిబంధనలు పాటించడం లేదు” అంటూ దుకాణ యజమానులను భయపెట్టి ఫైన్లు విధించారు. ఫుడ్ సేఫ్టీ సర్వీసెస్ గుంటూరు పేరుతో రసీదులు కూడా ఇచ్చి పదుల సంఖ్యలో దుకాణాల నుంచి డబ్బులు వసూలు చేసినట్లు సమాచారం. అధికారుల మాదిరిగా ప్రవర్తించడం వల్ల ప్రారంభంలో చాలా మంది వ్యాపారులు నిజమైన తనిఖీలేనని భావించి డబ్బులు చెల్లించినట్లు తెలుస్తోంది.
అయితే మహిళల ప్రవర్తనపై కొంతమంది స్థానికులకు అనుమానం రావడంతో వారిని ప్రశ్నించారు. దీంతో తమ పై అధికారులతో మాట్లాడాలంటూ వారు ఫోన్లో మాట్లాడినట్లు నటించారు. స్థానికంగా ఉన్న అసలు ఫుడ్ సేఫ్టీ అధికారుల పేర్లు ప్రస్తావిస్తూ తమకు పరిచయం ఉందని చెప్పి పరిస్థితిని తప్పించుకునే ప్రయత్నం చేశారు. అనంతరం ముఖాలకు మాస్కులు కట్టుకుని వచ్చిన ఆటోలోనే కళ్యాణదుర్గం వైపు వెళ్లిపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
ఈ ఘటనపై అనుమానం వచ్చిన షాపు యజమానులు స్థానిక ఫుడ్ సేఫ్టీ అధికారులను సంప్రదించగా, అలాంటి మహిళా బృందం తమ శాఖలో ఎవరూ లేరని స్పష్టం చేశారు. దీంతో తాము నకిలీ అధికారుల చేతిలో మోసపోయామని వ్యాపారులకు అర్థమైంది.
ఘటనపై స్పందించిన అనంతపురం జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని బాధితులకు సూచించారు. దీంతో దుకాణ యజమానులు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో ఎలాంటి భయం లేకుండా నకిలీ అధికారులు తిరుగుతూ తనిఖీలు నిర్వహించి డబ్బులు వసూలు చేయడం ప్రస్తుతం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పోలీసులు కేసు నమోదు చేసి మహిళల బృందం కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు సమాచారం.
ALSO READ: ప్రకృతి ఒడిలో సాహస యాత్ర