కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ప్రధాన పాత్రలో నటించిన తాజా యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘కర’ ఇప్పుడు ఓటీటీలో ప్రేక్షకులను అలరిస్తోంది. దర్శకుడు విఘ్నేశ్ రాజా తెరకెక్కించిన ఈ చిత్రంలో యువ నటి మమిత బైజు హీరోయిన్గా నటించింది. ఏప్రిల్ 30న తెలుగు, తమిళ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకుంది. బాక్సాఫీస్ వద్ద ఓ మోస్తరు విజయాన్ని నమోదు చేసినప్పటికీ, ముఖ్యంగా ధనుష్ నటన, యాక్షన్ సన్నివేశాలు, క్లైమాక్స్ భాగం సినీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ధనుష్ గత చిత్రాల స్థాయిలో భారీ వసూళ్లు రాకపోయినా, ఆయన నటనకు మాత్రం విమర్శకుల ప్రశంసలు దక్కాయి.
ఈ చిత్రంలో ధనుష్ “కరస్వామి” అనే లోకల్ దొంగ పాత్రలో కనిపించారు. తన సహజమైన నటనతో భావోద్వేగాలు, యాక్షన్, మాస్ ఎలిమెంట్స్ అన్నింటినీ సమపాళ్లలో చూపించి అభిమానులను ఆకట్టుకున్నారు. థియేటర్లలో విడుదలైన తర్వాత మంచి చర్చనీయాంశంగా మారిన ఈ సినిమా ఇప్పుడు ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ఫ్లెక్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ప్రకటించినట్లుగానే మే 28 నుంచి ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్కు అందుబాటులోకి తీసుకొచ్చింది. తెలుగు, తమిళంతో పాటు పలు ప్రధాన భారతీయ భాషల్లో కూడా ఈ సినిమా ప్రస్తుతం అందుబాటులో ఉంది.
వెల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ పతాకంపై ఐషరి కె గణేష్ ఈ చిత్రాన్ని నిర్మించగా, తెలుగు ప్రేక్షకులకు విఘ్నేశ్వర ఎంటర్టైన్మెంట్స్ మరియు ఆర్ స్టార్ లాజిస్టిక్స్ సంయుక్తంగా విడుదల చేశాయి. ఈ సినిమాలో సూరజ్ వెంజరమూడు, కేఎస్ రవికుమార్, కరుణాస్, జయరామ్, పృథ్వీ రాజన్, శ్రీజ రవి, ఆడుకలం నరేన్, రవి మరియా తదితరులు కీలక పాత్రల్లో నటించారు. సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ కుమార్ ఈ చిత్రానికి స్వరాలు సమకూర్చారు.
సినిమా కథ విషయానికి వస్తే.. కరస్వామి అనే దొంగగా జీవించే వ్యక్తి ప్రేమించి పెళ్లి చేసుకున్న మల్లి కోసం తన నేర జీవితానికి ముగింపు పలికి కొత్త జీవితాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకుంటాడు. చిన్న హోటల్ ప్రారంభించి సాధారణ జీవితం గడపాలనే ఆశతో, ఊరిలో ఉన్న పొలం పత్రాలను బ్యాంకులో తాకట్టు పెట్టాలని భావిస్తాడు. ఆ కాగితాల కోసం చాలా సంవత్సరాల తర్వాత తన తండ్రి వద్దకు వెళ్లాల్సి వస్తుంది. అయితే అక్కడ జరిగిన అనూహ్య సంఘటనలు అతని జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయి. బ్యాంకు అధికారుల క్రూరత్వం కారణంగా తన తండ్రిని కోల్పోయిన కరస్వామి జీవితంలో ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలు, అలాగే ముత్తు సెల్వన్ పాత్ర అతని జీవితాన్ని ఎలా ప్రభావితం చేసింది అన్నదే సినిమా ప్రధాన కథాంశం. భావోద్వేగాలు, యాక్షన్, కుటుంబ అనుబంధాలు కలిసిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయిన వారు ఇప్పుడు ఇంట్లోనే చూసి ఆస్వాదించే అవకాశం పొందుతున్నారు.
ALSO READ: లేని హత్యకు నేరస్థులుగా మారిన తండ్రీకొడుకులు!