నల్లగొండ, క్రైమ్మిర్రర్: నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం ఉట్లపల్లి గ్రామంలో హృదయ విదారక ఘటన పలువురిని కంటతడిపెట్టించింది. నాలుగేళ్ల బాలుడు ప్రమాదవశాత్తు బోరుబావిలో పడ్డాడు. విషయం తెలిసిన వెంటనే బాలుడి తాత వెంకన్న అక్కడకు చేరుకుని చిన్నారిని రక్షించేందుకు బోరుబావిలోకి దిగాడు. ఈ క్రమంలో బోరుబావిలో వెంకన్న తలకిందులుగా ఇరుక్కుపోయాడు. దీంతో స్థానికుల సమాచారం మేరకు పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు.
పోలీసు బృందం ఎంతో శ్రమించి తాత, మనవడిని బయటకు తీశారు. వెంటనే ఇద్దరినీ స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే బోరుబావిలో తలకిందులుగా ఇరుక్కోవడంతో ఊపిరాడక వెంకన్న తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. బోరుబావులను సరిగా మూయకపోవడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మనవడిని రక్షించబోయి తాత ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి.