-
సొంతవారికి కాంగ్రెస్ కార్పొరేటర్ టిక్కెట్లు ఇప్పించేందుకు కొండా దంపతుల వ్యూహం
-
అవసరమైతే ఇండిపెండెంట్ ప్యానెల్ బరిలోకి?
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: తెలంగాణ మాజీమంత్రి కొండా సురేఖ ఇప్పుడు తప్పు గుర్తిస్తున్నట్టు ఉన్నారు. అనవసరంగా మంత్రి పదవి కోల్పోయామన్న బాధ వారిలో కనిపిస్తోంది. మంత్రి పదవి కోల్పోయిన తర్వాత తన ఇమేజ్ పెరుగుతుందని భావించారు. కానీ రెండింటికి చెడ్డ రేవడిలా మారిపోయారు. ఆమెను భరించేందుకు ఏ రాజకీయ పార్టీ ముందుకు రావడం లేదు.
దీంతో ఆమెలో పశ్చాత్తాపం ప్రారంభమైనట్లు తెలుస్తోంది. రాజకీయ ఆశయాల కోసం కుమార్తె అతిగా ఆవేశపడడంతోనే సమస్యలు వచ్చాయి. కుమార్తెకు రాజకీయం నేర్పే ప్రయత్నం చేయకపోగా… తాము కూడా అదే బాటలోని వెళ్లారు. ఇప్పుడు అన్ని కోల్పోయారు. కొన్నాళ్లు సైలెంట్ గా ఉండాలని భావిస్తున్నారు.
-
లండన్ కు సుస్మిత పటేల్..
తన వల్లే తన తల్లి మంత్రి పదవి కోల్పోయారన్న ఆవేదనతో ఉన్నారు సుస్మిత పటేల్. మొన్న ఆ మధ్యన ఆమె కన్నీరు పెడుతున్న వీడియో కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. ప్రస్తుతం సుస్మిత లండన్ వెళ్లిపోయినట్లు ప్రచారం జరుగుతోంది.
ఆమె కొన్నాళ్లపాటు అక్కడే ఉండాలని భావిస్తున్నారట. తన మూలంగానే ఇంత రాజకీయ రగడ జరిగినందుకు ఆమె పశ్చాత్తాపంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ అంశం వల్ల ఇంకా ఎక్కువ సమస్యలు రాకూడదని కొన్నాళ్లపాటు ఆమె లండన్ వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఎన్నికలకు ముంగిట మళ్లీ వచ్చి అవకాశాలు చూసుకోవాలన్నది ఆమె ఆలోచనగా సమాచారం.
-
పట్టు నిలుపుకోవడమే లక్ష్యం..
ప్రస్తుతం రాజకీయంగా ఉన్న పట్టును నిలుపుకోవడం కొండా దంపతుల ముందున్న లక్ష్యం. వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో సొంతవారికి, తమను నమ్ముకున్న వారికి కార్పొరేటర్ టిక్కెట్లు ఇప్పించుకోవడమే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్నారు.
ఒకవేళ పార్టీ పరంగా కొన్ని స్థానాల్లో సమన్వయం లోపం వచ్చినా.. కాంగ్రెస్ టికెట్ దక్కకపోయినా.. తమ మద్దతుదారులను ఇండిపెండెంట్ అభ్యర్థులుగా బరిలో దించి గెలిపించుకోవాలని చూస్తున్నారు. తద్వారా వరంగల్ నగరంలో తమ మార్కు ఆధిపత్యాన్ని కొనసాగించాలని భావిస్తున్నారు.
-
రాజకీయంగా దూకుడు..
మంత్రివర్గంలో స్థానం కోల్పోవడం వారిని మానసికంగా ఇబ్బంది పెట్టింది. కానీ రాజకీయంగా వెనక్కి తగ్గే ఆలోచనలో వారు లేనట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ కంటే.. తమ బలం ఎక్కువ అని నిరూపించుకునేలా వరంగల్ కార్పొరేషన్.. పరకాల అసెంబ్లీ స్థానంలో సొంత వర్గాన్ని బలోపేతం చేసుకోవడం ద్వారా హై కమాండ్ కు తమ అవసరమైన శక్తినంత నిరూపించుకోవాలని చూస్తున్నారు.
కేవలం ఇప్పుడు ఉన్నది తాత్కాలిక రాజకీయ వెనుకంజ మాత్రమేనని.. కార్యకర్తల బలంతో మళ్లీ పుంజుకుని కుమార్తెకు తిరుగులేని రాజకీయ భరోసా ఇవ్వడమే కొండా దంపతుల టాస్క్ అని స్పష్టంగా తెలుస్తోంది.
