-
గుండెపోటుతో విశాఖలో మృతి
-
తీవ్ర విషాదంలో అభిమానులు
-
మృదుస్వభావిగా గుర్తింపు
క్రైమ్ మిర్రర్, విశాఖపట్నం: ఏపీ రాజకీయాల్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం, మాజీ మంత్రి ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ అలియాస్ నాని మంగళవారం గుండెపోటుతో మరణించారు. విశాఖలో తన నివాసంలో ఉండగా ఆయన ఒక్కసారిగా తీవ్ర గుండెపోటుకు గురయ్యారు.
కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అప్పటికే ఆయన తుది శ్వాస విడిచారు. ఆయన వయస్సు 56 సంవత్సరాలు. ఆళ్ల నానిగా అందరికీ సుపరిచితులు. ఆయన ఆకస్మిక మరణంతో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు, రాజకీయ నాయకులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
-
కాంగ్రెస్ ద్వారా ఎంట్రీ..
కాంగ్రెస్ పార్టీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు ఆళ్ల నాని. దివంగత రాజశేఖరరెడ్డి నానిని ఎంతగానో ప్రోత్సహించారు. 2004, 2009 ఎన్నికల్లో ఏలూరు శాసనసభ నియోజకవర్గం నుంచి రెండుసార్లు వరుసగా గెలిచారు నాని. వివాదరహితుడిగా, కార్యకర్తలకు నిత్యం అందుబాటులో ఉండే ప్రజానాయకుడిగా ఆయన గుర్తింపు పొందారు.
రాజశేఖర్ రెడ్డి మరణానంతరం ఆయన జగన్ వెంట అడుగులు వేశారు. 2013లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2014 ఎన్నికల్లో ఓడిపోయిన ఆయన 2019లో వైసీపీ తరఫున గెలిచారు. జగన్ ప్రభుత్వంలో మంత్రిగా కూడా వ్యవహరించారు. డిప్యూటీ సీఎం గా పదోన్నతి పొందారు.
-
కీలకమైన వైద్య ఆరోగ్యశాఖ..
జగన్మోహన్ రెడ్డి ఆళ్ల నానికి ఎంతగానో ప్రాధాన్యం ఇచ్చారు. ఏకంగా వైద్య ఆరోగ్యశాఖను కట్టబెట్టారు. ఆయన మంత్రిగా ఉన్న సమయంలోనే కరోనా విజృంభించింది. ఆ సంక్షోభ సమయంలో వైద్య ఆరోగ్యశాఖను ముందుండి నడిపించారు. చురుకైన పాత్ర పోషించారు. ఏలూరులో వింత వ్యాధి ప్రబలినప్పుడు స్వయంగా రంగంలోకి దిగారు.
అయితే మొన్నటి ఎన్నికల్లో ఏలూరు నుంచి ఐదోసారి పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. తరువాత టిడిపి గూటికి చేరారు. కానీ విశాఖ నగరానికి పరిమితమయ్యారు. ఇంతలోనే గుండెపోటుతో మృతి చెందారు. దీంతో తీవ్ర విషాదం అలుముకుంది.
