ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ జిల్లా దురౌలి గ్రామంలో కుటుంబ కలహం విషాదానికి దారితీసింది. ఫోన్ విషయంలో తలెత్తిన అనుమానంతో భార్యపై భర్త దాడి చేయగా, ఆమె ప్రాణాలు కోల్పోయిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.
పోలీసుల వివరాల ప్రకారం, గజేంద్ర సంఖ్వార్ (30)కు ఇప్పటికే వివాహం కాగా ఒక కుమారుడు ఉన్నాడు. అనంతరం అతను ఆస్మా అనే మహిళతో ప్రేమలో పడి, మొదటి కుటుంబానికి దూరంగా ఉండి ఆమెను కోర్టు వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది.
వివాహం అనంతరం ఆస్మా తన పేరు స్వప్నగా మార్చుకుని గజేంద్రతో కలిసి జీవనం కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో స్వప్న ఫోన్లో మాట్లాడుతున్న విషయంపై గజేంద్ర అనుమానం వ్యక్తం చేయడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.
ఆగ్రహానికి లోనైన గజేంద్ర ఐరన్ రాడ్తో స్వప్న తలపై బలంగా దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. తీవ్ర గాయాల కారణంగా ఆమె అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
also read: భర్త ఫోన్ ఎత్తలేదన్న మనస్తాపంతో వివాహిత బలవన్మరణం
