ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ నియామకాల్లో స్పోర్ట్స్ కోటాకు సంబంధించి ఎలాంటి అక్రమాలు చోటుచేసుకోలేదని శాప్ ఎండీ భరణి స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై వస్తున్న ఆరోపణలను ఆమె ఖండించారు.
ఇదే సమయంలో కొందరు వ్యక్తులు పాఠశాలలకు వెళ్లి ఉపాధ్యాయులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని భరణి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీచర్లపై దాడులకు పాల్పడటంతో పాటు.. విద్యార్థుల సమక్షంలో వారిని అవమానించేలా వ్యవహరించడం ఏమాత్రం సమంజసం కాదన్నారు.
స్పోర్ట్స్ కోటాకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను చూపించాలంటూ కొందరు ఉపాధ్యాయులను బెదిరిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. ఈ తరహా చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించారు.
ఉపాధ్యాయులను వేధించడం, పాఠశాలల్లోకి వెళ్లి గొడవలకు దిగడం లేదా దాడులకు పాల్పడటం వంటి ఘటనలకు పాల్పడితే సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని భరణి స్పష్టం చేశారు. అవసరమైతే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
డీఎస్సీ స్పోర్ట్స్ కోటా ఎంపిక ప్రక్రియపై అనవసరమైన అపోహలు సృష్టించకుండా వాస్తవాలను తెలుసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
also read: ‘ఇరుముడి’పై వివాదం.. అయ్యప్ప భక్తుల ఆగ్రహం
