వివాదాస్పద వీడియోల వ్యవహారంలో ఎంఐఎం ఎమ్మెల్సీ మిర్జా రహ్మత్ బేగ్పై పార్టీ అధిష్ఠానం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయనను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించడంతో పాటు, ఎమ్మెల్సీ పదవికి కూడా వెంటనే రాజీనామా చేయాలని ఆదేశించినట్లు సమాచారం.
ఇటీవల ఓల్డ్ సిటీకి చెందిన ఓ జర్నలిస్టు చేసిన ఆరోపణలు ఈ వ్యవహారానికి కేంద్రంగా మారాయి. అత్తాపూర్లో ఓ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడుతున్న సమయంలో మిర్జా రహ్మత్ బేగ్ పట్టుబడ్డారని ఆయన ఆరోపించారు. కొందరు యువకులు ఎమ్మెల్సీపై దాడి చేసి, ఘటనకు సంబంధించిన వీడియోలను చిత్రీకరించారని కూడా పేర్కొన్నారు.
అయితే ఈ ఆరోపణలను ఎమ్మెల్సీ మిర్జా రహ్మత్ బేగ్ ఖండించారు. తనపై సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న వీడియోలు డీప్ఫేక్ వీడియోలు అంటూ ఆయన గతంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీడియోలను మార్ఫింగ్ చేసి తన ప్రతిష్ఠను దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోందని ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో తాజాగా ఎంఐఎం పార్టీ ఆయనపై చర్యలు తీసుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని పార్టీ ఆదేశించడంతో ఈ వ్యవహారం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.
అయితే మిర్జా రహ్మత్ బేగ్పై వచ్చిన ఆరోపణలు, వీడియోల అసలు స్వరూపంపై సంబంధిత దర్యాప్తు సంస్థల నుంచి వెలువడే అధికారిక వివరాల ఆధారంగానే పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
also read: విషాదంగా మారిన పూజా కార్యక్రమం… కొత్త కారు ఢీకొని 70 ఏళ్ల వ్యక్తి మృతి
