సూర్యాపేట జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. చిన్న విషయంగా మొదలైన వివాదం చివరకు ఇద్దరి ప్రాణాలను బలిగొంది. మేళ్లచెరువు మండలం ఎర్రగడ్డ తండాలో రెండు వర్గాల మధ్య ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
స్థానిక సమాచారం ప్రకారం.. ఇంటి పక్కన ఉన్న వేపచెట్టుకు సంబంధించి ఇరువర్గాల మధ్య కొంతకాలంగా వివాదం కొనసాగుతోంది. ఈ క్రమంలో శుక్రవారం ఇరువర్గాల మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. పరిస్థితి అదుపు తప్పడంతో పరస్పరం గొడ్డళ్లతో దాడులకు పాల్పడినట్లు తెలుస్తోంది.
ఈ దాడుల్లో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ఘర్షణను అదుపు చేసేందుకు పోలీసులు ప్రయత్నించగా.. మేళ్లచెరువు ఎస్సై నవీన్ కుమార్కు కూడా గాయాలయ్యాయి.
ఘటనతో ఎర్రగడ్డ తండాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు, మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
also read: పుణే జిల్లాలో దారుణం…! 9ఏళ్ల బాలికపై అత్యాచారం…
